ముగిసిన పెద్ద తిరునాళ్ల
తిరుపతమ్మ ఆలయంలో పూర్ణాహుతి
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత అమ్మవారి కల్యాణం పీటలపై కూర్చొన్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి వంశీకులు కొల్లా హరికృష్ణ, భవ్య, కాకాని రవిబాబు, త్రివేణి దంపతులతో కలశపూజలు, పంచాహ్నిక కల్యాణాన్ని పురోహితులు, వేదపండితులు, ఆలయ అర్చకులు పాపమాంబ వంశీకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐదు రోజుల కల్యాణ ఉత్సవం అనంతరం ఆలయ ఆవరణలో హోమం ఏర్పాటు చేసి శాంతి సంరక్షణకు పూర్ణాహుతి చేశారు. యజ్ఞం అనంతరం హోమద్రవ్యాలను హోమగుండంలో పడేశారు. దీంతో తిరునాళ్లకు ముగింపు పలికారు. కల్యాణం రోజున తిరుముడి సమర్పించి దీక్ష విరమించని స్వాములు పూర్ణాహుతి రోజు దీక్ష విరమించారు. తిరుముడిలోని ముద్దర (నెయ్యితో నింపిన) టెంకాయలను ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన హోమగుండంలో వదిలారు. పూర్ణాహుతిలో స్వాములతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీసభ్యులు చుంచు రమేష్బాబు, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, జగ్గయ్యపేట సీఐ పి వెంకటేశ్వర్లు, ఆలయ ఈఈ ఎల్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


