దేవునిపై విధేయతతో జీవించాలి
గుణదల(విజయవాడ తూర్పు): దేవునిపై విధేయత కలిగి జీవిస్తే సకల ఆశీర్వాదాలు లభిస్తాయని పాస్ట్రల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ విజయరాజు అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న నవదిన ప్రార్థనలు 6వ రోజుకు చేరుకున్నాయి. గురువారం జరిగిన ప్రార్థనల్లో ఆయన మాట్లాడుతూ దేవుని మహిమను గుర్తించి ప్రార్థిస్తే సకల దీవెనలు లభిస్తాయన్నారు. మరియతల్లిపై విశ్వాసం ఉన్న భక్తుల జీవితాలు సంతోషకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆమె పవిత్రతను, భక్తి జీవితాన్ని గుర్తించిన దేవుడు మరియ గర్భాన జన్మించాడని వివరించారు. అందుకే మరియమాతకు ప్రత్యేక అనుగ్రహాలు దేవుని ద్వారా సిద్ధించాయని చెప్పారు. ఆమెను లోకమాతగా కీర్తిస్తున్నారని, ఆమెను ఆశ్రయించిన భక్తులకు శాంతి సమాధానాలు లభిస్తాయన్నారు. అనంతరం మరియమాత స్వరూపం వద్ద ఉన్న ప్రత్యేక బలిపీఠం వద్ద సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. పలు విచారణల నుంచి భక్తులు కొవ్వొత్తులతో దేవుని గీతాలను ఆలాపిస్తూ కొండపైకి చేరుకున్నారు. కార్యక్రమంలో మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ మరియన్న,ఫాదర్ నునీల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక
గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతోందని పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి జయరాజు అన్నారు. ఈ ఏడాది లూర్దు మాత మహోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మరియమాత పుణ్యక్షేత్రానికి దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. యాత్రికుల సౌకర్యార్థం నూతన ఆలయ సమీపంలో గృహ సముదాయాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.


