
ప్రతి కుటుంబం నుంచి వ్యాపారులు రావాలి
పటమట(విజయవాడతూర్పు): ఒక కుటుంబం.. ఒక వ్యాపారి అనే నినాదంతో స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావ్వాలని మెప్మా డైరెక్టర్ తేజ భరత్ సూచించారు. ప్రతి కుటుంబం నుంచి వ్యాపారులు రావాలని ఆకాంక్షించారు. వీఎంసీ–మెప్మా – ఇండియా ఎస్ఎంఈ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఐవీ ప్యాలెస్లో స్వయం సహాయక సంఘాలకు స్టార్ పెర్ఫార్మర్ మహిళల వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేజభరత్ మాట్లాడుతూ.. పట్టణాల్లోని స్వయం సహాయక సమూహాలను వ్యాపారులుగా రూపొందంచే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న పొదుపు సంఘాల మహిళలను స్టార్ పెర్ఫార్మర్లుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ స్టార్ పెర్ఫార్మర్ మహిళలకు వారి వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలు, మెంటర్షిప్, సహాయ సహకారాలు అందించేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం, మెప్మా లీప్(లైవ్లీహుడ్స్ ఎన్హ్యాన్మెంట్ అండ్ యాస్పిరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్) నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా రిటైల్, టెక్స్టైల్స్, ఫుడ్, బ్యూటీ – వెల్నెస్, ఫర్నిచర్ – ఉడ్ ప్రొడక్ట్స్ ఉంటాయని వివరించారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, జెమ్ రిజిస్ట్రేషన్, ఇన్కంటాక్స్ – కంప్లయన్సెస్, క్వాలిటీ – ప్యాకేజింగ్, డిజిటల్ టూల్స్, మార్కెట్ యాక్సెస్ (ఆన్లైన్ – ఆఫ్లైన్), ఐపీఆర్ రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ సపోర్ట్ – ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ యూసీడీ ప్రాజక్ట్ అధి కారి పి.వెంకటనారాయణ, టెక్నికల్ ఎక్స్ఫర్ట్ (జీవనోపాధులు) జి.ఎస్.సుజాత పాల్గొన్నారు.