బాసర: నిర్మల్ జిల్లా బాసర–బిద్రెల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు దుర్మరణం చెందాడు. స్థానికులు, బాసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముధోల్ గ్రామానికి చెందిన కె.బాబు (50) బాసర ట్రిపుల్ ఐటీ ప్రారంభమైనప్పటి నుంచి సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి ముధోల్ నుంచి బాసరకు రాత్రి డ్యూటీ కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో బాసర–బిద్రెల్లి మధ్య ప్రధాన రహదారిపై పంక్చర్ అయిన లారీ నిలిపి ఉంది. దానిని చీకట్లో గమనించలేకపోయిన బాబు.. వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాబు తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, 108లో క్షతగాత్రుడిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాబు మృతిచెందాడు. సుదీర్ఘకాలంగా ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న బాబు అకస్మాత్తుగా మరణించడంతో సహచర భద్రతా సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాసర ఎస్హెచ్వో దీపక్ తెలిపారు.


