పోరు రసవత్తరం | - | Sakshi
Sakshi News home page

పోరు రసవత్తరం

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

పోరు రసవత్తరం

పోరు రసవత్తరం

● ప్రచారానికి రెండు రోజులే గడువు ● మందు, విందుపై దృష్టి

ఆసిఫాబాద్‌: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్ర చార రథాలతో కాలనీల్లో రికార్డు చేసిన ఆడియోలతో మైకులు హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్ర ధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండడంతో గెలుపుకోసం ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల ఇన్‌చార్జీలు వార్డుల్లో పర్యటిస్తూ గెలుపోటములపై బేరీ జు వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పట్టు నిలుపుకేందుకు యత్నిస్తుండగా, మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ ముందుకెళ్తోంది. మెజా ర్టీ కౌన్సిలర్‌ స్థానాలను దక్కించుకునేందుకు ప్రధా న పార్టీలు పోటీ పడుతున్నాయి. సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుండగా గులాబీ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యాలంటూ అధికార కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ప్రచారం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఆపార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

నేతల పర్యటన

ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ కాగజ్‌నగర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో 50 కౌన్సిలర్‌ స్థానాలుండగా యాభై శాతం మహిళలకు కేటాయించారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 10 వార్డులు మహిళలకు కేటాయించగా, కాగజ్‌నగర్‌లో 30 వార్డులుండగా 15 వార్డులు మహిళలకు కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మహిళలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భార్యలు బరిలో ఉన్న ప్రాంతాల్లో భర్తలతో పాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులు ప్రచారం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాదరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం, బీజేపీ నేత వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు తమపార్టీ చైర్మన్‌ స్థానం కై వసం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ బల్దియాపై కాంగ్రెస్‌ పట్టు నిలుపుకునేందుకు ఎమ్మెల్సీ దండె విఠల్‌, బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కృషి చేస్తున్నారు.

మిగిలింది రెండు రోజులే

జిల్లాలో ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజు లే మిగిలింది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్ర చారం నిలిపివేయనున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 2,3,11 వార్డుల్లో ఎన్నికలు రసవత్తరంగా మారా యి. అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు మద్యం, విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడం లేదు. గెలుపుకోసం అభ్యర్థులు, నేతలు పాట్లు పడుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్‌ చేయనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ముందుగానే ప్రణాళికతో మద్యం బాటిళ్లు సమకూర్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement