అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
దహెగాం: ఉపాధిహామీ పథకంలో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో దత్తారావు అన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద దహెగాం మండలంలో రూ.7.96 కోట్లతో చేపట్టిన పనులపై నాలుగు రోజులుగా గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీల అనంతరం గ్రామ సభల్లో వివరాలు సేకరించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం 15వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నగదు రికవరీ చేస్తామన్నారు. మండల వ్యాప్తంగా 432 పనులకు రూ.7.96 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 24 పంచాయతీల్లో నిర్వహించిన తనిఖీ నివేదికలను సభ్యులు చదివి వినిపించారు. పలు పంచాయతీల్లో పనికి వెళ్లకున్నా కూలీలకు డబ్బులు చెల్లించడం, పనుల రికార్డులు సక్రమంగా లేకపోవడం, నాటిన మొక్కలను సంరక్షించకపోవడం, కూలీల సంతకాలు లేకపోవడం వంటి తప్పిదాలను గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన మండల కేంద్రానికి చెందిన టీఏ రాజేశ్పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు టీఏలు, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రూ.25 వేలు జరిమానా వేయడంతోపాటు రూ.1.62 లక్షల నగదు రికవరీకి ఆదేశించారు. నలుగురు మేట్లను తొలగిస్తున్న ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్టీఏ వేణు, ఎస్ఆర్పీ రవియాదవ్, అంబుడ్స్ పర్సన్ సాయిశ్రీ, క్యూసీ రమేశ్, పీఆర్ఏఈ ఆత్మారాం, ఏపీవో కల్పన తదితరులు పాల్గొన్నారు.


