● విజిలెన్స్ తనిఖీల్లో బయటపడిన అక్రమాలు ● అరుణాచలం మిల్లు యజమాని అరెస్ట్, రిమాండ్
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచలం శివ రైస్మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల తనిఖీ సందర్భంగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ మేరకు మిల్లు యజమాని కిరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచలం శివ రైస్మిల్లులో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం డీఎస్పీ ఆధ్వర్యాన సోదాలు చేపట్టింది. సీఎంఆర్ విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యాన రికార్డుల ఆధారంగా ధాన్యం స్టాక్ ఉందా, లేదా పరిశీలిస్తూ లాట్లను లెక్కించారు. ఈక్రమాన 442 మె.టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు తేల్చారు. దీని విలువ దాదాపు రూ.1,23,96,160 కావడం, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు గుర్తించి బుధవారం రాత్రే మిల్లు యజమాని ఓరుగంటి కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి ఫిర్యాదుతో గురువారం నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా, వైద్యపరీక్షల అనంతరం ఆయనను రిమాండ్కు తరలించారు. అయితే, రూ.కోట్ల విలువైన అక్రమాలు జరుగుతున్నా జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు ఇన్నాళ్లు గుర్తించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


