ఆయిల్పామ్లో తెల్లదోమ
● ఆకుల రసం పీలుస్తుండడంతో నష్టం ● పైరు ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం ● నివారణ చర్యలపై అధికారుల సూచనలు
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్పామ్ తోటలు ఉన్నాయి. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఈ తోటలతో దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ఎక్కువమంది రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం 1.20 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుండగా.. ఇటీవల ఆయిల్పామ్ తోటలను తెల్లదోమ ఆశించడం, ఆకులు, పంటపై ఈ తెగులు దాడితో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తదితర మండలాల్లో ఈ తెల్లదోమ ఉధృతి కనిపిస్తోంది. వాతావరణంలో తేమ పెరగడం, చల్లని వాతావరణం కారణంగా తెల్లదోమ ఆశిస్తోందని ఉద్యాన అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవి మొదలవుతున్న తరుణాన తెల్లదోమ ఆశించటం రైతులను కలవరపరుస్తోంది. తద్వారా పైరు ఎదుగుదల తగ్గడంతో పాటు దిగుబడి పడిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన సత్తుపల్లి, వేంసూరు ప్రాంతాల్లోని ఆయిల్పామ్ తోటల్లో ఖమ్మంజిల్లా ఉద్యానాధికారి ఎంవీ మధుసూదన్ ఇటీవల తెల్లదోమ ఉధృతిని గుర్తించగా, నివారణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు.
ఆయిల్పామ్ మొక్కలపై ఆకుల దిగువ భాగాన తెల్లదోమ నివసిస్తూ రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాక ఆకులు ముడుచుకుంటాయి. ఫలితంగా మొక్కల పెరుగుదల తగ్గుతోంది. ఈ తెల్లదోమ తేనె వంటి పదార్థాన్ని విడుదల చేయడం వల్ల ఆకులపై నల్లటి పొర (సూటీ మోల్డ్) ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. ఇది పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పొలంలో కలుపు మొక్కలను తొలగించి శుభ్రత పాటించాలి. పసుపు స్టిక్కీ ట్రాప్లు ఏర్పాటు చేయాలి. తీవ్ర దాడి ఉన్నప్పుడు ఉద్యాన అధికారుల సూచన తీసుకున్నాక ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థియామెథోక్సామ్ 0.25 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, జీవ నియంత్రణ కోసం వేపనూనె 10,000 పీపీఎం 1.5 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాక రైతులు తోటను తరచుగా పరిశీలిస్తూ తెల్ల ఈగ లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అవసరమైతే సూచనల కోసం ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని మధుసూదన్ సూచించారు.
ఆయిల్పామ్లో తెల్లదోమ


