తుది దశకు మాస్టర్ ప్లాన్
● ఉన్నతాధికారుల పరిశీలనే తరువాయి.. ● రెండు, మూడు వారాల్లో సుడా ఫైనల్ ప్లాన్ ప్రకటన? ● అభ్యంతరాల ఆధారంగా స్వల్ప మార్పులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల భవిష్యత్ను నిర్దేశించే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) మాస్టర్ ప్లాన్ ముసాయిదా చివరి దశకు చేరుకుంది. ఈ ప్లాన్పై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల అనంతరం వాటిలో స్వల్ప మార్పులు చేర్పులు చేసిన అధికారులు.. ఫైనల్ ముసాయిదాను హైదరాబాద్ డీటీసీపీ, ప్రభుత్వానికి అందజేశారు. అధికారులు తమ బాధ్యతలను పూర్తి చేయగా.. ఇప్పుడు హైదరాబాద్ డీటీసీపీ, వరంగల్ ఆర్జేడీ అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది. వీరు పరిశీలించి నివేదికలను డీటీసీపీకి అందజేస్తే ప్రభుత్వం నుంచి సుడా మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందనుంది. డీటీసీపీ నుంచి జేడీ, వరంగల్ ఆర్జేడీ రాక కోసం సుడా అధికారులు ఎదురుచూస్తున్నారు.
స్వల్ప మార్పులు..
నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, రెసిడెన్షియల్, కమర్షియల్, వ్యవసాయం, చెరువులు, మైనింగ్, చారిత్రక నిర్మాణాలు, కొండలు, అటవీ భూములు, రవాణ వ్యవస్థ తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని 2041 వరకు జరిగే అభివృద్ధిని దృష్ట్యా ముసాయిదా ప్లాన్ను అధికారులు రూపొందించారు. తమకు అభ్యంతరకరంగా ఉన్నవాటిని మార్చాలని ప్రజల నుంచి అభ్యంతరాలు అందాయి. వాటిలో ప్రధానంగా ముదిగొండలోని కొంత ప్రాంతాన్ని, రఘునాథపాలెంలోని కొంత ప్రాంతాన్ని పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్గా చూపించడంతో అక్కడి నివాసితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ ప్రాంతాలను మిక్స్డ్ జోన్గా మార్చినట్లు తెలిసింది.
రెండు రోజుల పాటు..
సుడా అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదా హైదరాబాద్ అధికారుల వద్దకు చేరింది. దీనిపై డీటీసీపీ నుంచి జేడీ, వరంగల్ నుంచి ఆర్జేడీ అధికారులు వారం రోజుల్లో ఖమ్మంలో పర్యటించనున్నారు. సుడా పరిధిలోని ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, అధికారులు చేసిన మార్పులను వీరు పరిశీలించి, అన్నీ ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా చూస్తారు. వీరు రెండు రోజుల పాటు ఖమ్మంలోనే ఉండి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల పాటు మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఏజెన్సీ బృందం వీరితో పాటు పర్యటనలో పాల్గొననుంది. పరిశీలనానంతరం అధికారులు డీటీసీపీ ద్వారా ప్రభుత్వానికి ఫైనల్ నివేదిక అందజేయనున్నారు. రెండు, మూడు వారాల్లోనే సుడా మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం నుంచి ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
571.83 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో..
పాత సుడా పరిధిలోనే 571.83 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో అధికారులు ప్లాన్ రూపొందించారు. ఖమ్మం కార్పొరేషన్తో పాటు ఏడు మండలాల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటితోనే ప్రస్తు త ముసాయిదా ప్లాన్ను రూపొందించారు. ఇది ఫైనల్ అయితే నిర్మాణాలు, అభివృద్ధి పనులన్నీ దాని ప్రకారమే జరగనున్నాయి. సుడా పరిధిలో ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వైరా వర కు, ఇటు రఘునాథపాలెం, కూసుమంచి, ముదిగొండతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంరూరల్ మండలాల్లో భారీగా వెంచర్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్లో వాటిలో నిర్మాణాలతో పాటు కొత్త వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలు సక్రమంగా జరగాలంటే మస్టార్ ప్లాన్ కీలకమని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.


