హోరాహోరీగా బాల్బ్యాడ్మింటన్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్ : రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడల్లో భాగంగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో కుమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నల్లగొండ, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు, బాలికల విభాగంలో మెదక్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నల్లగొండ, జనగాం, హైదరాబాద్ టీంలు నాకౌట్ దశకు చేరాయి. సోమవారం ఉదయం క్వార్టర్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఉంటాయని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. కాగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో ఈసారి నూతనంగా బాల్బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలోనూ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరు కాగా, అందరికీ ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
బహుమతుల ప్రదానం..
జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పురుషుల డబుల్స్ విభాగం పోటీల విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు, అడిషినల్ ఎస్పీ జి.వెంకట్రావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రామోజీ రమేష్, అడ్మిన్ ఏఎస్పీ రామానుజం ప్రొఫెసర్ పింగిళి రమేష్ రెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియషన్ కార్యదర్శి వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
ఐదు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఓపెన్ కేటగిరీలో డి.ప్రహ్లాద్ – సిద్ధార్థ, రేవంత్ – తరుణ్, 35 ఏళ్ల డబుల్స్ విభాగంలో టి.శ్రీను, ఎ.సుదర్శన్ – షఫీ, గోపాల్ కిషన్, 45 ఏళ్ల కేటగిరీలో రజనీకాంత్, రవికిరణ్ – వేణుగోపాల్, పి.ఎం.కార్తీక్, 50 ఏళ్ల వారిలో కె.జితేందర్రెడ్డి, ఎం.కిరణ్కుమార్ – కె.సతీష్ రెడ్డి, ఎం.సతీష్కుమార్, 55 ఏళ్లలో డాక్టర్ వెంకన్న, పూర్ణ – కె.ప్రభాకర్రెడ్డి, బి.జగన్, 60ఏళ్లలో ఎన్.రఘు, సైదేష్ – ఖాజ, కోటయ్య వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.
హోరాహోరీగా బాల్బ్యాడ్మింటన్ పోటీలు


