సాగు బాగయ్యేలా...
● కూరగాయ పంటలకు వలంటీర్ల గుర్తింపు ● సహకార సంఘాల పరిధిలో 58 మంది ఎంపిక ● పథకాలు, ప్రోత్సాహకాలతో విస్తీర్ణం పెంపునకు కసరత్తు
జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇప్పటికే సహకార శాఖ ద్వారా వలంటీర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ప్రాంతాల వారీగా సాగు చేసే పంటల వివరాలను ఉద్యాన అధికారుల ద్వారా గుర్తిస్తాం. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు అందేలా చూస్తాం. – ఎం.వి.మధుసూదన్,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి
ఖమ్మంవ్యవసాయం: కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యాన శాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సమృద్ధిగా వనరులు ఉండీ.. కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. స్థానికంగా 30 నుంచి 40 శాతం కూరగాయల పంటలు ఉత్పత్తి అవుతుండగా, ఇతర ప్రాంతాల నుంచి 60 నుంచి 70 శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఉద్యాన శాఖ గుర్తించింది. కూరగాయల దిగుమతితో ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారుతోంది. వీటన్నింటినీ గుర్తించిన ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు.
వలంటీర్లతో సాగు
హైదరాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన ఉద్యాన జాతీయ సదస్సులో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్ కూరగాయల కొరతను అధిగమించేందుకు వలంటీర్లు చేయాల్సిన కార్యాచరణపై వివరించారు. ఇప్పటికే ఈ ప్రక్రియపై జిల్లాల సహకార సంఘాల్లో ప్రత్యేకంగా వలంటీర్ల(రైతులు) ఎంపిక పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వీటి నుంచి 58 మంది రైతులను గుర్తించారు. ఈ రైతుల ద్వారా కూరగాయల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూరగాయల పంటల సాగుకు రాష్ట్రీయ కృషీ వికాస యోజన(ఆర్కేవీవై) వంటి పథకాలను అమలు చేస్తోంది. కాకర, బీర, దొండ, సొర, చిక్కుడు తదితర పందిరి సాగు పంటలకు ఎకరాకు రూ.లక్ష సబ్సిడీ కల్పిస్తున్నారు. జిల్లాలోని నీటి వనరులు, నేలల రకాలను బట్టి సాగు చేసే కూరగాయల పంటలను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు మధిర, వైరా, సత్తుపల్లి, కూసుమంచి, నేలకొండపల్లి, ఏదులాపురం, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, రఘునాథపాలెం, కొణిజర్ల, కామేపల్లి, ఏన్కూరు, బోనకల్, ఎర్రుపాలెం, ముదిగొండ మండలాలను కూరగాయల కొనుగోలు కేంద్రాలుగా అభివృద్ధి చేసి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సాగు బాగయ్యేలా...
సాగు బాగయ్యేలా...


