తొలిరోజు అంతంతే..
● ఏడు మున్సిపాలిటీల్లో 11 నామినేషన్లు ● కొత్తగూడెం కార్పొరేషన్లో ముగ్గురు ● ఇందులోనూ బీ ఫామ్లు ఇచ్చింది కొందరే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 117 వార్డులు ఉండగా, నామినేషన్ల స్వీకరణకు 43కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, తొలిరోజు ఎనిమిది చోట్ల కలిపి 14నామినేషన్లే దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం అభ్యర్థులు ఉండగా, కొందరే బీ ఫామ్లు అందజేశారు.
మధిర, కల్లూరు నిల్
ఐదు మున్సిపాలిటీలకు గాను సత్తుపల్లిలో తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో వార్డు, 14 వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు, 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. వైరా మున్సిపాలిటీలోని రెండో వార్డు, 11వ వార్డుకు బీఆర్ఎస్ అభ్యర్థులు, ఏదులాపురం 23వ వార్డులో కాంగ్రెస్, 31వ వార్డు నుంచి సీపీఎం తరఫున ఒకరు నామినేషన్ వేశారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్లో 60డివిజన్లు ఉండగా, 8, 19, 56డివిజన్ల నుంచి ఒక్కో నామినేషన్ దాఖలైంది. అశ్వారావుపేటలో 22వ వార్డులకు గాను మూడో వార్డుకు ఇద్దరు, 22వ వార్డుకు ఒకరు, ఇల్లెందులో 24వార్డులకు గాను ఆరో వార్డు నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. కల్లూరు, మధిర మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా, నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరిని తనిఖీ చేశాకే అనుమతించారు. వైరాలో నామినేషన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా పరిశీలించారు.
సలహాలు, సూచనలు
నామినేషన్ పత్రాల దాఖలుకు వచ్చే అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేలా సిబ్బందిని నియమించారు. కేంద్రం బయట వీరు సలహాలు ఇచ్చారు. అంతేకాక అభ్యర్థులు ఇంటి, నల్లా పన్నులు చెల్లించేలా కేంద్రాల వద్ద డిజిటల్ పేమెంట్ యంత్రాలతో సిబ్బందిని కేటాయించారు. వీరు ఓటర్ల జాబితా ఆధారంగా పేర్లు పరిశీలించడంతో పాటు ప్రతిపాదకులకు ఓటుహక్కు ఉందా, లేదా అని నిర్ధారణ చేశారు.
రేపటితో ముగింపు..
నామినేషన్ల దాఖలుకు రెండు రోజుల సమయం ఉంది. గురువారం, శుక్రవారం నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోపక్క బీ ఫామ్ సాధించేందుకు అభ్యర్థులు ఆరాట పడుతున్నారు. అయితే, రెండో రోజైన గురువారం నామినేషన్లు జోరందుకుంటాయని భావిస్తున్నారు.


