
రాజీవ్ స్వగృహ ఇళ్లు వేలం
● 18 ఏళ్ల క్రితం రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం ● చివరి దశలో ఆగిన పనులు ● వేలంలో విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయం
ఖమ్మంరూరల్: ఖమ్మంరూరల్ మండలం పోలేపల్లి పరిధిలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగుల కోసం 9.22 ఎకరాల్లో రాజీవ్ గృహకల్ప నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాలు, ఎనిమిది బ్లాకులు, తొమ్మిది ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్కు 8 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం మీద 576 ఫ్లాట్లతో రాజీవ్ స్వగృహ ఇళ్లను నిర్మించారు. అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణ బాధ్యతను కట్టబెట్టింది. సదరు కాంట్రాక్టర్లు ఇళ్లకు స్లాబులు వేసి, ప్లాస్టరింగ్ చేసి వదిలి వేశారు. ఇక అప్పటి నుంచి అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణం కంటే ముందు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు కేటాయించాలని నిర్ణయించి అర్హులైన వారి నుంచి రూ.3 వేలు చొప్పున డిపాజిట్ తీసుకున్నారు. ఇక 15 ఏళ్లుగా డిపాజిట్ చేసిన ఉద్యోగులు ఇళ్ల కేటాయింపు కోసం ఎదురుచూశారు. అనంతరం తమకే ఇళ్లు కేటాయించాలని అప్పట్లో పెద్దఎత్తున ఆందోళన చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వారికి చెల్లించింది.
వేలంలో విక్రయం..
రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. డిపాజిట్ చేసిన రూ.3వేలు తిరిగి తీసుకెళ్లాలని, ఇళ్లను కొత్తగా వేలం వేసి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఆమేరకు డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వచ్చీ రాగానే సీఎం రేవంత్రెడ్డి కూడా రాజీవ్స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయిచి, వచ్చే సొమ్మును ప్రభుత్వాదాయానికి సమకూర్చుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించనున్నారు.
ఏర్పాట్లలో అధికారులు..
ఇదిలా ఉండగా స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ఈ నెల మొదటి వారంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ సందర్శించా రు. నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్వగృహకు వెళ్లడానికి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి నుంచి స్వగృహ వరకు 60అడుగుల అప్రోచ్ రోడ్ మంజూరు చేసి వెంటనే పనులను కూడా ప్రారంభించారు. స్వగృహ ఇళ్లకు రక్షణగా మున్నేరు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నందున బఫర్ జోన్ కూడా వర్తించదని, అదనంగా సౌకర్యాలు కూడా కల్పిస్తామని సదరు బిల్డర్లకు, కొనుగోలుదారులకు హామీ ఇచ్చారు. అదనంగా క్లబ్ హౌస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, 24 గంటల సెక్యూరిటీ, వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలతో పాటు సురక్షిత, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగుల కుటుంబాలు నివసించే విధంగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర ఉద్యోగులతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, సింగరేణి, కేటీపీఎస్, బ్యాంకింగ్, ఎఫ్సీఐ, ఎల్ఐసీ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. కాగా, 150కి పైగా ఫ్లాట్స్ కొనుగోలు కోసం వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు.
స్వగృహలో చదరపు అడుగు ధర రూ.1,150 మాత్రమే. ముఖ్యంగా వివిధ సంస్థలో పని చేసే ఉద్యోగులకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో నిర్మాణానికి అయిన ఖర్చు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ఇంత తక్కువ ధరలో ఇవ్వాలని నిర్ణయించాం. బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లు, ఇలా గ్రూప్ హౌసింగ్ పథకాలపై ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇందు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 22న నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 8న లాటరీ విధానంలో కేటాయించనున్నాం. స్వగృహలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.
–వీపీ గౌతమ్, స్వగృహ ఎండీ

రాజీవ్ స్వగృహ ఇళ్లు వేలం