సాక్షి బళ్లారి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్న (పీఎంఎఫ్బీవై) ప్రధానమంత్రి ఫజల్ భీమా యోజన కింద బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు సమీపిస్తోంది. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పీఎంఎఫ్బీవై కింద ఈనెల 31వ తేదీ వరకూ ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఉంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చాలా మంది రైతులు వివిధ కారణాలతో బీమా చేయించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, సర్వర్ మందగించడం, రికార్డులు సక్రమంగా లేకపోవడం, బ్యాంకులు, సంబంధిత కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ, రైతులకు అవగాహన లోపంతో రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి సాగు అధికం..
బళ్లారి, కంప్లీ, సిరుగుప్ప, హొసపేటె నియోజక వర్గాల్లో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులకు ఆగస్టు 14వ తేదీ వరకు బీమా చెల్లించేందుకు గడువు ఉంది. వర్షాధారిత భూములు, ఆయకట్టు భూముల్లో పండించే జొన్న, మొక్కజొన్న, రాగి, సజ, కంది, తదితర పంటలకు జూలై 31వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారు. వరి నాటే రైతులు ఎకరాకు రూ.879, మొక్కజొన్నకు రూ.617, రూ.546, రాగికి రూ.404 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పంట వివరాలతో నమోదు చేసుకోవాలి. అయితే గతంలో చెల్లించినా బీమా పరిహారం అందకపోవడంతో ఈసారి బీమా ప్రీమియం చెల్లించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో ఈ పథకంపై అవగాహన కల్పించాల్సి ఉంది.
సమీపిస్తున్న గడువు
ప్రీమియం చెల్లించేందుకు
రైతాంగం అనాసక్తి
ఈనెల 31 పీఎంఎఫ్బీవై
చెల్లింపునకు తుది గడువు
వరికి ఆగస్టు 14 వరకూ గడువు
బీమాతో రైతులకు
భరోసా


