రాయచూరు రూరల్: పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ.. సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మార్కెట్ ధరలకు అనుగుణంగా కోడిగుడ్ల డబ్బు చెల్లించాలని కోరారు. సొంత డబ్బుతో గుడ్లు కొనుగోలు చేయడం వల్ల కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరంసమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారి (కలెక్టర్) పూవితకు సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకురాలు వరలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు
మానసిక ధృడత్వం అవసరం
హుబ్లీ: నైతిక విద్య బోధించే ఉపాధ్యాయులను మరింతగా మేధావులుగా తీర్చిదిద్దడం సంస్థ గురుతర బాధ్యత అని ప్రముఖ సైక్యాటిస్ట్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సదరు సంస్థ, విస్తార గ్లోబల్ టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో పీయూసీ, ఐటీఐ, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వర్క్షాప్ నిర్వహంచారు. పలువురు మాట్లాడుతూ.. డాక్టర్. వీరేంద్రహెగ్డే ఆశయం మేరకు జేఎస్ఎస్ విద్యా సంస్థలు పని చేస్తున్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు సిబ్బంది సక్రమ మార్గంలో నడిచేలా చూసుకోవడం సంస్థ బాధ్యత అని గుర్తు చేశారు. అలాంటి వర్క్షాపులు ఉపాధ్యాయులకు బోధన, నైపుణ్య వృద్ధికి కొత్త బోధన విధానాలు, విద్యార్థి కేంద్రీకృత బోధన, తరగతుల నిర్వహణ పరిమాణాత్మక బోధన సూత్రాలను నెర్చుకోవడానికి దోహదపడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేష్, డాక్టర్.ఆర్వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య
రాయచూరు రూరల్: హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ రాయచూరు జిల్లా కేంద్ర కారాగృహంలో ఉన్న ఒక ఖైదీ.. ఆసుపత్రి శౌచాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. హుబ్లీకి చెందిన పవన్ కుమార్ (32) ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా క్షయ వ్యాధి (టీబీ) తో పాటు అన్ననాళంలో తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 22న జైలు అధికారులు గట్టి పోలీస్ బందోబస్తు మధ్య అతడిని రాయచూరు ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి తీవ్రత భరించలేక మంగళవారం ఆసుపత్రిలోని శౌచాలయానికి వెళ్లిన పవన్ కుమార్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే రాయచూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరుణాంగ్షు గిరి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై మార్కెట్ యార్డ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బసవరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నిరంతర ప్రయత్నంతో విజయం సాధ్యం
హుబ్లీ: విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉండాలని జేఎస్ఎస్ కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. జేఎస్ఎస్ బనశంకరి హార్డ్స్, కామర్స్ అండ్ శాంతి కుమార గుబ్బి సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల దీక్ష బోధ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రామాణికత, నిష్ట నిరంతరం ప్రయత్నం, సానుకూల వైఖరి కలిగి ఉండాలని సూచించారు. డిగ్రీలో ప్రవేశం పొందిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు జేఎస్ఎస్ పాలనాధికారి హరి హంత ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్.వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. పీయూసీలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్.సురత్ జైన్, మహవీర ఉపాద్యే, తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి చేనేత సహకార
సంఘం పాలక మండలి రద్దు
● అధ్యక్షుడు రామకృష్ణపై
అక్రమాల ఆరోపణలు
● విచారణ అనంతరం పాలక మండలి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ
బళ్లారి అర్బన్: బళ్లారి చేనేత సహకార సంఘం పాలక మండలిని సహకార శాఖ అధికారులు రద్దు చేశారు. సంఘం అధ్యక్షుడు ఏ.రామకృష్ణ సంఘం అభివృద్ధిని విస్మరించి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాన్ని వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. సంఘం డైరెక్టర్లు బి.పద్మావతి, ఎస్.లక్ష్మీదేవి, సి.కోనయ్య తమ పదవులకు రాజీనామా చేశారు. సంఘం ఆస్తులను పరిరక్షించి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సహకార సంఘాల సమాయ పర్యవేక్షకుడు గ్యానప్ప విచారణ చేపట్టారు. ఈనెల 23న బళ్లారి చేనేత సహకార సంఘం పాలక మండలిని రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఏ.రామకృష్ణతో పాటు డైరెక్టర్లు మురళి, రాజాలు బళ్లారిలోని జిల్లా సహకార సంఘాల కార్యాలయం రద్దు ఉత్తర్వులను స్వీకరించినట్లు తెలిసింది.


