రాగుల కొనుగోళ్లు షురూ
హొసపేటె: కూడ్లిగి పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ కమిటీలో రాగుల కొనుగోలు ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. పట్టణంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతులతో కలిసి స్వయంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఏపీఎంసీ సభ్యుడు మల్లికార్జునగౌడ మాట్లాడారు. 2025–26వ సంవత్సరంలో రాగి క్వింటాల్కు రూ.4,886 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతులు స్వయంగా కొనుగోలు కేంద్రానికి వచ్చి బయోమెట్రిక్ ద్వారా అమ్మకాలు సాగించాలని తెలిపారు.
ఆటో బోల్తా..
పలువురికి గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని మొరబ క్రాస్ నుంచి నగరం వైపునకు వెళుతున్న ఆటో బోల్తా పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న 25 మందికి పైగా గాయపడిన ఘటన బుధవారం జరిగింది. మొరబతో పాటు తాలూకాలోని ఇతర గ్రామాల ప్రజలు ఆటోలో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఆటో సమీపంలోని పొలంలోకి బోల్తా పడింది. సమీపంలోని ప్రజలు, హైవే పోలీసు సిబ్బంది కలిపి ఆటోను పైకి లేపి అందులోని ప్రయాణికులను కాపాడారు. సమాచారం అందిన వెంటనే కూడ్లిగి సీఐ, ఎస్ఐ, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను కూడ్లిగి ఆస్పత్రికి తరలించారు. ఎక్కువగా గాయపడిన వారిని బళ్లారి బిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రతిభ వెలికితీతకు శిబిరాలు దోహదం
హొసపేటె: విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు శిబిరాలు దోహద పడతాయని కొట్టూరు స్వామి సంస్థాన మఠం బసవలింగ స్వామి తెలిపారు. సర్వధర్మ రథోత్సవం సందర్భంగా బుధవారం కొట్టూరు స్వామి మఠంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిత్రలేఖనంలో ఎన్నో విశిష్టమైన, వైవిధ్యమైన చిత్రాలు మనస్సును ఎంతో ఆకట్టుకుంటాయన్నారు. ఇలాంటి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాఽధికారిణి కవిత ఎస్.మన్నికేరి, అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, డీఎస్పీ డాక్టర్ మంజునాథ్ తళ్వార్ తదితరులు పాల్గొన్నారు.
ఇండో–అమెరికా డీల్తో
ప్రతికూల ప్రభావం
బళ్లారిఅర్బన్: భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని బీడీఏఏ ఫుట్బాల్ మైదాన సభాగృహంలో బుధవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో రైతు ఉద్యమ గీతాన్ని సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్.రఘునాథ్ రచించిన ఆడియా రూపంలో విడుదల చేశారు. అనంతరం సంఘ నాయకులు చాగనూరు మల్లికార్జున రెడ్డి, టీజీ విఠల్, కరూరు మాధవరెడ్డి, డాక్టర్ బీఆర్.చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందం వ్యవసాయ రంగానికే కాకుండా దేశ రాజకీయాలపైనా దుష్ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐకేఎంకేఎస్ సంస్థకు చెందిన రచయిత్రి ప్రొఫెసర్ జ్యోతి రాణి రచించిన భూమి పరాయీకరణ (భూమి యాజమాన్య హక్కులను చట్టబద్ధంగా ఇతర సంస్థలకు బదిలీ చేసే ప్రక్రియ) అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.
రాగుల కొనుగోళ్లు షురూ


