ఆఫ్రికా నుంచి చీతా అతిథులు
బొమ్మనహళ్లి: కన్నడనాట చీతాలు సందడి చేయబోతున్నాయి. బెంగళూరులోని బన్నేరుఘట్ట జూ పార్క్కు దక్షిణాఫ్రికా నుంచి మార్చి మొదటి వారంలో చీతాలు రాబోతున్నాయి. ఏప్రిల్లో ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో మైసూరు జూ తరువాత చీతాలు ఉన్న జూపార్క్ ఇదే అవుతుంది. గతంలో ప్రధాని మోదీ చొరవతో మధ్యప్రదేశ్లోని కున్హా అభయారణ్యంలోకి కొన్ని చీతాలను తెప్పించి పోషిస్తున్నారు.
4 ఏనుగులను పంపించి..
వన్యజీవుల మార్పిడి పథకం కింద నాలుగు ఏనుగులను దక్షిణాఫ్రికాకు పంపించి, నాలుగు చీతా పులులను తెప్పిస్తున్నట్లు జూ అధికారులు తెలిపారు. ఏనుగులను ఇప్పటికే బన్నేరుఘట్ట నుంచి పంపించారు. చాలా వేగంగా పరిగెత్తే చీతాలకు పెద్ద ప్రాంతం అవసరం కాబట్టి, బన్నేరుఘట్టలో అందుకు అనువైన ప్రదేశాన్ని సిద్ధం చేసినట్లు జూ ఈడీ ఎ.వి. సూర్యసేన్ చెప్పారు.
త్వరలో చింపాంజీలు కూడా..
బన్నేరుఘట్టలో ప్రస్తుతం 85 చిరుతలు, 20 పులులు, 27 సింహాలు, 9 జీబ్రాలు, 2 జిరాఫీలు, 29 ఏనుగులతో సహా పాములు, కొండచిలువలు వంటి 2,000 విభిన్న జంతువులు ఉన్నాయి. ఏటా 20 లక్షల మందికి పైగా ప్రజలు సందర్శిస్తున్నట్లు చెప్పారు. అలాగే సింగపూర్ మృగాలయం నుంచి 3 మూడు చింపాంజీలను బన్నేరుఘట్టకు త్వరలో తెప్పిస్తున్నట్లు తెలిపారు.
మార్చిలో బెంగళూరు
బన్నేరుఘట్ట జూ పార్క్కు రాక
ఆఫ్రికా నుంచి చీతా అతిథులు


