ఏసీ పేలి గోదాము దగ్ధం
యశవంతపుర: బెంగళూరు ఉత్తర జిల్లా నెలమంగల తాలూకా పర్యామ్ గౌడాన్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిజ్వాలలు, ఉవ్వెత్తున పొగ రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 40 మంది ఫైర్సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల చిక్కుకున్న ముగ్గురు కార్మికులను రక్షించారు. వారికి గాయాలు కావడంతో విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. ఏసీ పేలి మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గోదాములోని వస్తువులు బూడిదయ్యాయి.
జ్యోతిష్యుడు
కమలాకర్పై పోక్సో కేసు
యశవంతపుర: ప్రముఖ జ్యోతిష్యుడు కమలాకర్ భట్పై మరో పోక్సో కేసు నమోదైంది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార వద్ద సిద్ధాపురలో వసంత నాయక అనే వ్యక్తి హత్య కేసులో కమలాకర్ భట్, అతని ప్రియురాలు సుచిత్రలు ఇప్పటికే జైలులో ఉన్నారు. అయితే సుచిత్ర కుమార్తెను కూడా భట్ లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. ఈ మేరకు స్వయంగా బాధిత బాలిక భట్ దురాగతంపై ఫిర్యాదు చేసింది. కార్వార పోలీసులు కేసు నమోదు చేసి శివమొగ్గ తుంగానగర ఠాణాకు బదిలీ చేశారు.
వరుసగా వాహనాల ఢీ
బనశంకరి: నగరంలో మాదావర మెట్రోస్టేషన్ సమీపంలో ఫ్లై ఓవర్ పైన ఆదివారం ఉదయం రెండు కేఎస్ ఆర్టీసీ బస్సులు, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న 20 మందికి కాళ్లు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో వంతెన మీద కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భల్లూకం కన్నుమూత
తుమకూరు: ఒక రైతు పొలంలో నీళ్ల తొట్టిలో నీళ్లు తాగడానికి వచ్చిన ఎలుగుబంటి ట్యాంక్లో అలాగే మరణించిన సంఘటన నిట్టూరు హోబ్లిలోని అరెనహళ్లి గ్రామంలో జరిగింది. 10 ఏళ్ల ఆడ ఎలుగుబంటిగా అటవీ సిబ్బంది తెలిపారు. నీరు, ఆహారం కోసం వెతుకులాడుతూ ఇక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్న రీతిలో ప్రాణాలు విడిచింది. ఆహారంలేక అది తీవ్ర అనారోగ్యానికి గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పశువైద్యులతో పోస్ట్మార్టం జరిపి కళేబరాన్ని కాల్చివేశారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయన్నారు.
వారిద్దరూ కుటుంబవాదులు
శివాజీనగర: కుర్చీ కోసం కులాన్ని లాగారని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపణను తమాషాగా స్వీకరించానని సీఎం సిద్దరామయ్య ఆదివారం ఓ ప్రకటనలో అన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా సామాజిక న్యాయానికి అనుకూలంగా తన విధానం ఉంటుందన్నారు. కుమారస్వామి, ఆయన తండ్రి దేవేగౌడ నిజమైన జాతి వాదులు కాదు. వారు స్వజాతి వ్యతిరేకులు అని అన్నారు. అంతకంటే ముఖ్యంగా కుటుంబవాదులు అని విమర్శించారు.
ఏసీ పేలి గోదాము దగ్ధం


