16 ఏళ్లలోపు విద్యార్థులకు నో మొబైల్!
శివాజీనగర: రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలలో విద్యార్థుల మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించడం గురించి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య విద్యారంగ మేధావులకు ఈ సూచన చేయగా, చర్చకు కారణమైంది. బెంగళూరులో గవర్నర్ నివాసం లోక్భవన్లో అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, విద్యారంగ అధికారులు, నిపుణుల సమావేశంలో సీఎం సిద్ద రామయ్య మాట్లాడుతూ విద్యార్థులపై మొబైల్ఫోన్, సోషల్ మీడియా దుష్పరిణామాలు, డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. పాఠశాలలు, కాలేజీలలో విద్యార్థులకు మొబైల్ఫోన్ను నిషేధించడం గురించి సీఎం ప్రస్తావిస్తూ మీ అభిప్రాయం ఏమిటని వీసీలను అడిగారు. ఎక్కువమంది వీసీలు ఆమోదం తెలుపుతూ మద్దతిచ్చారు. విద్యార్థులకు మొబైల్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరముంది,
ఇది అందరికీ కాదు, 16 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులను మొబైల్ ఫోన్ నుంచి దూరంగా పెట్టాలని సీఎం తెలిపారు. ఆస్ట్రేలియాతో పాటుగా అనేక దేశాల్లో పాఠశాలల్లో మొబైళ్లను అనుమతించడం లేదని, చదువుపై శ్రద్ధ వహించడానికి ఈ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
అమలయ్యేనా?
ప్రభుత్వం త్వరలోనే మొబైల్ బ్యాన్ గురించి మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేయవచ్చని తెలుస్తోంది. దీనికి విద్యార్థులు, ఉపాధ్యాయుల స్పందన ఎలా ఉంటుంది, విజయవంతమవుతుందా? అనేది చూడాలి. ప్రైవేటు స్కూళ్లలో బాలలు 7, 8వ తరగతి నుంచే మొబైల్స్ను తీసుకొస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులు అందరి వద్దా ఉంటోంది. సౌకర్యం మాటేమోగానీ పెడ పోకడలకు కారణమవుతోందని ఆందోళన ఉంది.
పాఠశాలలు, కాలేజీలలో
బ్యాన్ చేద్దామా?
వీసీలకు సీఎం సిద్దరామయ్య సూచన
బాలలు సోషల్ మీడియాకు
బలవుతున్నారని ఆందోళన
వీసీలు, విద్యారంగ నిపుణుల మద్దతు
రెండురోజుల కిందట
బెంగళూరులో ఓ కాలేజీ
వేడుకలో మొబైళ్లతో
విద్యార్థులు
16 ఏళ్లలోపు విద్యార్థులకు నో మొబైల్!
16 ఏళ్లలోపు విద్యార్థులకు నో మొబైల్!


