కన్నీటి బతుకులు
భర్త ఆత్మహత్య..
బెదిరింపులతో భార్య సైతం..
శివమొగ్గ: భర్త ఆత్మహత్య చేసుకుని దుఃఖంలో ఉన్న యువతిని పోలీసు వేధించడంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులకే దంపతులు పరలోకానికి చేరారు. ఈ విషాదం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగరంలోని హోస సిద్ధాపురలో జరిగింది. వివరాలు.. స్వాతి (26), పోలీసు శాఖ ఆఫీసులో డీ–గ్రేడ్ ఉద్యోగి అయిన జగదీష్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీష్ శివరాత్రి రోజున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రావతిలోని న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం అతని భార్య స్వాతి కూడా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు స్వాతి తన తల్లికి వాట్సాప్ సందేశం పంపింది, తీర్థహళ్లి తాలూకాలోని మలూరు ఠాణాకు చెందిన ఓ పోలీసు అధికారి నీ భర్త మరణానికి నువ్వే కారణమని బెదిరించాడని, పలు రకాలుగా ఒత్తిడి చేశాడని వాపోయింది. ఇది జిల్లాలో చర్చనీయాంశమైంది. తన కూతురి మృతిపై విచారణ జరిపి కారకులను శిక్షించాలని ఆమె తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యశవంతపుర: భార్యపై అనుమానంతో ఆమె తలపై బండరాయితో బాది నుజ్జునుజ్జు చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటన బెంగళూరు కగ్గలీపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కుళ్లేగౌడపాళ్యకు చెందిన సించన (21)ను ఆమె భర్త రేణుకయ్య అంతమొందించాడు. రెండేళ్ల కిందట పెళ్లి కాగా, చిన్నపాటి పనులు చేసుకుని జీవించేవారు. అయితే సించన అందంగా ఉండడంతో రేణుకయ్యలో అనుమాన పిశాచి నిద్రలేచింది. రోజూ తాగి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఆమెతో రగడపడి కొట్టడంతో కిందపడిపోయింది. ఈ సమయంలో పెద్ద రాయి తీసుకొని ఆమె తలపై పదేపదే మోదటంతో తల నుజ్జయి మరణించింది. కగ్గలీపుర పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కిరాతకుడు రేణుకయ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఆనేకల్లో..
9 మంది బాలికలపై అఘాయిత్యం
బనశంకరి: మాయమాటలు చెప్పి 9 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధున్ని శనివారం బెంగళూరు శివార్లలోని ఆనేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనేకల్ పాఠశాలలో 9 మంది విద్యార్థినులకు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి కృష్ణమూర్తి అనే కామాంధుడు బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడేవారు. కొంతకాలంగా అతని అకృత్యాలు జరుగుతున్నాయి. మొత్తం 9 మంది విద్యార్థినులపై ఇతడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో స్థానికంగా కలకలం ఏర్పడింది. బాలికల తల్లిదండ్రుల్లో ఆవేదన నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం కృష్ణమూర్తిని అరెస్ట్చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
రాష్ట్రంలో పలుచోట్ల మహిళల
ఆత్మహత్యలు, అఘాయిత్యాలు
భర్త వేధింపులు.. గర్భిణి బలవన్మరణం
మైసూరు: మరింత కట్నం తేవాలని భర్త పెట్టే వేధింపులను తాళలేక గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరులో జరిగింది. చాముండిపురం నివాసి ఎస్.సంజన (19) అనే యువతి, ఆకాష్ ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు, కొన్ని నెలల కిందట గర్భం దాల్చింది. అయితే కొంతకాలంగా ఆకాష్ ఆమెది తక్కువ కులం అని నిందించడమేగాక పుట్టింటికెళ్లి డబ్బు, బంగారం తేవాలని నిత్యం వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఈక్రమంలో ఆమె మహదేవపురలోని పుట్టినింటికి వచ్చి ఉంటోంది. భార్యకు వీడియో కాల్ చేసిన ఆకాష్ మళ్లీ ఆమెను దూషించడంతో విరక్తి చెందిన సంజన అక్కడే ఉరి వేసుకుంది. అల్లునిపై మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపుర పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆడపిల్లగా పుట్టడమే నేరమా..? మహిళగా జీవించడమే పాపమా? అన్నట్లు కొందరు అభాగినుల జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. భర్తల వేధింపులతో ఆత్మహత్యలు, భర్తే హంతకునిగా మారి ప్రాణాలు తీయడం, భర్త మరణించి దుఃఖిస్తుంటే ఓ పోలీసు వేధింపులను తాళలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం.. ఇలాంటి ఘోర దుష్కృత్యాలు వెలుగులోకి వచ్చాయి. కన్నీటి బతుకులకు అద్దం పట్టాయి.
కన్నీటి బతుకులు
కన్నీటి బతుకులు
కన్నీటి బతుకులు
కన్నీటి బతుకులు


