
వాల్మీకి నిధులతోనే కాంగ్రెస్ గెలుపు
సాక్షి బళ్లారి: గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాల్మీకి అభివృద్ధి నిగమ నిధులను ఖర్చు చేసి గెలుపొందారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం కొప్పళ జిల్లా గంగావతి నియోజకవర్గ పరిధిలోని అంజనాద్రిలో శ్రీఆంజనేయస్వామిని దర్శనం చేసుకొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సతీమణి లక్ష్మిఅరుణతో కలిసి అంజనాద్రి కొండను దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.నా తర్వాత ఆయన మాట్లాడుతూ రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాల్మీకి అభివృద్ధి నిగమ నిధుల స్వాహాలో కీలక పాత్రను పోషించారన్నారు. బళ్లారి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాలు పంచుకున్నారన్నారు.
ఆరోపణలపై దర్యాప్తు
ఆ ఎన్నికల్లో నిధులను ఖర్చుచేసి లోక్సభ సభ్యుడు తుకారాంను గెలిపించారనే ఆరోపణలు ఉండటంతో ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈడీ అధికారులు సరైన సమాచారంతోనే తనిఖీ చేసి ఉంటారన్నారు. ఈడీ అధికారులు సమాచారం లేకుండా సోదాలు చేయబోరన్నారు. ఈ విషయాలు వారే బహిర్గతం చేస్తారన్నారు. ఒక నెల రోజుల పాటు తాను జైల్లో ఉన్నానన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు సంతోషంగా ఉన్న సమయంలో భగవంతున్ని కృపా కటాక్షాలతో తనకు బెయిల్ దొరికిందన్నారు. గంగావతి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం దొరికిందన్నారు. జైలు నుంచి విడుదల అయినా ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నన్ను ఇరికించడానికి నాడు కుట్ర
హొసపేటె: తాను అక్రమ మైనింగ్ చేశానని పేర్కొంటూ సీఎం సిద్దరామయ్య నాడు పాదయాత్ర చేశారు. కానీ వాస్తవానికి అక్రమ మైనింగ్ జరగలేదని న్యాయమూర్తులే తేల్చి చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకొని నిందితుడిగా చేయడానికి నాడు కుట్ర జరిగిందని ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బంగారు హనుమంతు తండ్రి మరణించిన నేపథ్యంలో అతని నివాసంలో తన భార్యతో కలిసి అతని కుటుంబానికి సంతాపం తెలిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిర్దోషిగా విడుదలవుతానని, తనకు చట్టంపై నమ్మకం ఉందన్నారు. కూడ్లిగి నియోజకవర్గంతో శ్రీరాములు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర నాయకులు ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. బీజేపీ హైకమాండ్ ఎవరికి టికెట్లు ఇచ్చినా వారి గెలుపు కోసం అందరూ పని చేయక తప్పదన్నారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంగారు హనుమంతు, హురుళిహాళ్ రేవణ్ణ, వసంత్ కుమార్, సూర్య పాపన్న, మారేష్, లోకన్న, ఎన్.అజేయ, గురికార రాఘవేంద్ర, గుడేకోటె బేకరీ సురేష్, మహేష్, కోనహళ్లి శంభునాథ్, బోరువెల్ మంజన్న, సచిన్ కుమార్ పాల్గొన్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్రెడ్డి ఆరోపణ