పేదల జీవితాలను మార్చిన ప్రధాని | - | Sakshi
Sakshi News home page

పేదల జీవితాలను మార్చిన ప్రధాని

Jun 19 2025 4:20 AM | Updated on Jun 19 2025 4:20 AM

పేదల జీవితాలను మార్చిన ప్రధాని

పేదల జీవితాలను మార్చిన ప్రధాని

సాక్షి,బళ్లారి: పేదల జీవితాల్లో వెలుగులు నింపి, దేశ సమగ్రత, రక్షణ కోసం నిరంతరం ఎనలేని కృషి చేస్తూ, ప్రపంచానికి భారత ఖ్యాతిని తెలియజేసిన ఘనత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని, దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరాల్లో రెండు ట్రిలియన్ల నుంచి నాలుగు ట్రిలియన్లకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద శక్తిగా భారత్‌ ఖ్యాతి గడించిందని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వికసిత భారత్‌ లక్ష్యంగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా మోదీ సర్కార్‌ పని చేసిందన్నారు. 17, 18, 19 వార్డుల్లో మహాశక్తి కేంద్రం, అలాగే శక్తి కేంద్రాల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి

మోదీ సారథ్యంలో 2014 నుంచి దేశంలో సమర్ధవంతమైన ప్రభుత్వ పాలన వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. జన్‌ధన్‌, ఆధార్‌ మొబైల్‌ లింక్‌ లబ్ధిదారులకు రూ.44 లక్షల కోట్ల మేర డీబీటీ ద్వారా వారి ఖాతాలకు జమ అయిందన్నారు. అందుకే మోదీని హీరో చేశారన్నారు. గత కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రభుత్వంలో రక్షణ విభాగ ముఖ్యస్తుల పదవుల నియామకం చేపట్టలేదన్నారు. అయితే మోదీ పాలనలో అలాంటి కీలక పదవుల్లో సమర్థవంతులైన అధికారులను నియమించిన ఫలితంగా ఆపరేషన్‌ సింధూర్‌ కార్యాచరణ చేపట్టి పాక్‌ తీరును ఎండగట్టారన్నారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించారన్నారు. గతంలో అన్ని ఉత్పత్తులను దిగుమతులు చేసుకునే వారమన్నారు. అయితే ప్రస్తుతం మనమే మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా ద్వారా ఉత్పత్తి చేసి రూ.25 వేల కోట్ల విలువైన ఆయుధాలు తదితర ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా దేశం తొలిసారిగా గొప్ప ఘనత సాధించిందన్నారు.

పేదరికం తగ్గుముఖం

అతి పేదరిక ప్రమాణం 21 శాతం నుంచి 5 శాతానికి చేరుకుందన్నారు. 25 కోట్ల మంది పేదలు దారిద్య్రరేఖ దిగువ నుంచి పైకి వచ్చారన్నారు. ఇవి తాను చెప్పే వివరాలు కాదని, ప్రపంచ బ్యాంకు తెలియజేస్తోందన్నారు. రక్షణ వ్యవస్థ కూడా నిర్ధిష్టమైన లక్ష్యాలతో దూసుకెళుతోందన్నారు. నేపాల్‌లోని పశుపతి ఆలయం నుంచి తిరుపతి వరకు రెడ్‌ కారిడార్‌ ద్వారా భారత్‌లో పాలనను మట్టి కరిపించాలని ఉగ్రవాదుల ధ్యేయంగా ఉండేదని, అయితే ఈ విషయంలో మోదీ స్పష్టమైన గుణపాఠం నేర్పారన్నారు. సరిహద్దు ప్రాంతాలను మినహాయించి ఇతర చోట్ల కూడా ఉగ్రవాద కృత్యాలు చాలా వరకు నాశనం చేశారన్నారు. నేడు 70 శాతంపైగా నక్సలిజం తగ్గిపోయిందన్నారు. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో నక్సలిజం రూపుమాపడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలో గతంలో ఏ ప్రధానమంత్రి చేయని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రతిపక్ష పార్టీలు మోదీని సహించడం లేదని, అయితే మోదీని దేశంలోని ప్రతి పౌరుడు గౌరవిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, గాలి జనార్దనరెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ, బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా తదితరులు పాల్గొన్నారు.

దేశ ఘనతను ప్రపంచానికి

చాటి చెప్పిన నరేంద్ర మోదీ

గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ప్రశంస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement