
కృష్ణా నదిలో మహిళ గల్లంతు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు కృష్ణా నదిలో వరద నీరు అధికంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం కృష్ణా నదిలోకి కొత్త నీరు చేరడంతో వాయనం సమర్పించి పూజలు చేయడానికి నది వద్దకు వెళ్లిన ఓ మహిళ గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. ఆ మహిళను బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా మంజరి సంగీత శివాజీ మాంజేకర్గా పోలీసులు గుర్తించారు. పూజలు చేయడానికెళ్లిన సంగీత కాలు జారి పడడంతో నీటిలో కొట్టుకుపోయింది. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో ఆమె ఆచూకీ కోసం నదిలో పడవతో గాలింపు ప్రారంభించారు.
రాయచూరు వైద్యుడికి
క్యాపికాన్ అవార్డు
రాయచూరు రూరల్: రాయచూరు సీనియర్ జనరల్ వైద్యుడు డాక్టర్ ఎన్.ఎస్.జవుళికి క్యాపికాన్ అవార్డు లభించింది. ఈ నెల 15న హుబ్లీలో జరిగిన రాష్ట్ర వైద్య చికిత్సకుల సమ్మేళనంలో 42వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏపీఐ లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డును రాఘవేంద్ర బెళగాంవ్కర్, ఈశ్వర్ హెబ్బాళ్ చేతుల మీదుగా అందుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో డాక్టర్ జవళి చేసిన ప్రసంగాలు, పరిశోధనలు విపులంగా ఉన్నాయన్నారు.
ఎయిమ్స్ మంజూరుకు కమిటీ వద్దు
రాయచూరు రూరల్: దేఽశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మంజూరు అవుతున్న విద్యా సంస్థలపై కమిటీ అధ్యయనం చేస్తుందని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనడాన్ని రాయచూరు ఎయిమ్స్ పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ్ కళస తప్పుబట్టారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఎయిమ్స్, కశ్మీర్లో పోరోనిక్స్ విశ్వ విద్యాలయం మంజూరుకు కమిటీలు పరిశీలించాయని తెలిపారు. రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో కమిటీని రూపొందిస్తామని పేర్కొనడం అపహాస్యంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్లో రాష్ట్రం నుంచి మూడు జిల్లాల పేర్లను కేంద్రానికి పంపి రాయచూరుకు ఎయిమ్స్ రాకుండా అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఈ విషయంలో మౌనం వహించడాన్ని ఆయన ఖండించారు.
జాగృతితో మలేరియా వ్యాప్తికి చెక్
రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా నియంత్రణకు జన జాగృతి జాతాకు ప్రతి ఒక్కరు ముందుండాలని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. జిల్లా ఆరోగ్యాధికారి కార్యాలయంలో మలేరియా జాగృతి శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో నీరు నిల్వ చేరకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య శాఖాధికార్లు సురేంద్రబాబు, నందిత, గణేష్, శాకీర్, విజయ శంకర్లున్నారు.
గాలిపై అనర్హత ఆదేశాల ఉపసంహరణ
సాక్షి,బళ్లారి: అక్రమ గనుల తవ్వకం కేసులో శిక్షకు గురైన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా ప్రకటిస్తూ వెల్లడించిన ఆదేశాలను కర్ణాటక విధానసభ సెక్రటేరియట్ ఉపసంహరించుకుంది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు గాలి జనార్దనరెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు ఈనెల 11న స్టే ఇస్తూ, బెయిల్ మంజూరు చేయడంతో ఆయన శాసన సభ్యత్వాన్ని కూడా కర్ణాటక విధానసభ సెక్రటేరియట్ కార్యదర్శి ఎం.కే.విశాలాక్షి యథాప్రకారం కొనసాగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్యేగా గంగావతి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఏర్పడింది.

కృష్ణా నదిలో మహిళ గల్లంతు

కృష్ణా నదిలో మహిళ గల్లంతు

కృష్ణా నదిలో మహిళ గల్లంతు