
విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దండి
సాక్షి,బళ్లారి: పాఠశాలలు, హాస్టళ్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనువైన వాతావరణం, తగిన వసతులు కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగనగౌడ తెలిపారు. ఆయన బుధవారం నగరంలోని కోట ప్రాంతంలో బాలికల హాస్టల్, విద్యానగర్ నందా రెసిడెన్సియల్ స్కూల్, ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలతో పాటు తాళూరు రోడ్డు బాలభారతీ కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి పరిశీలించి అక్కడి స్థితిగతులను సమీక్షించి తగిన మార్గదర్శకత్వం చేశారు. కాగా కోట ప్రాంతంలో హాస్టల్లో దాదాపు 400 మందికి పైగా బాలికలు ఉన్నారని, హాస్టల్ నిర్వహణ అంతే పకడ్బందీగా చేపట్టాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛత, మరుగుదొడ్లు, పరిశుభ్రత, నాణ్యతతో కూడిన భోజనం, విద్యార్థినులకు అవసరమైన శ్యానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయాలని ఆయన వార్డెన్లకు సూచించారు. ముఖ్యంగా బాలల సహాయ వాణి 1098 నంబరును పెద్దగా బోర్డుపై రాయించాలన్నారు. బాలికల హాస్టళ్లలో వారి సురక్షతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బాలికలు ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆడప్లిలను ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం ఎంతో తోడ్పాటునందిస్తోందన్నారు. విద్యానగర్ నందా వసతి పాఠశాలను పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలల్లో బాలల సురక్షతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫీజుల విషయంలో పారదర్శకత పాటించాలన్నారు. ఇష్టానుసారుసారంగా ఫీజులు పెంచితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజుల గురించి బోర్డులు పెట్టాలని, సంబంధిత ప్రతి కాపీ సంబంధిత డీడీపీఐ, బీఈఓల కార్యాలయాలకు పంపించాలన్నారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల్లో బాలల సహాయ వాణిని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అత్యవసర సర్వీసులు 112 అని రాయించాలన్నారు. అనంతరం ఆయన ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాల, హైస్కూళ్లను పరిశీలించి ఆ స్కూలు మైదానం చక్కగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ‘నలియోణ, కలియోణ బా’ అనే గీతాన్ని నృత్య ప్రదర్శన ద్వారా ప్రదర్శించారు. దీనిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు వెంకటేశ్, సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా డీడీ మల్లికార్జున, వార్డెన్లు పాల్గొన్నారు.
బాల్య వివాహం శిక్షార్హమైన నేరం
హొసపేటె: అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టపరమైన పత్రాలు మినహా అన్ని ఫైళ్లపై బాల్య వివాహం శిక్షార్హమైన నేరం అనే ట్యాగ్లైన్ ముద్రించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కే.నాగనగౌడ తెలిపారు. జిల్లాధికారి కార్యాలయ హాలులో జరిగిన ప్రగతి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పిల్లల హక్కులను పరిరక్షించడానికి, బాలలను ప్రధాన స్రవంతిలోకి తేవడానికి పిల్లలపై పని చేసే అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి, వారిని అర్థం చేసుకోండి. వారికి మంచి సేవలను అందించండి అన్నారు.
అధికారులకు శిక్షణ ఇవ్వాలి
రాష్ట్రంలో జువైనెల్ జస్టిస్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి అన్ని శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. అధికారులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పోక్సో వంటి కేసులను నియంత్రించడానికి విద్యా శాఖ అనేక ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కమిషన్ సభ్యుడు శశిధర్ కోసుంబే అన్నారు.
అనధికార సెంటర్లను మూసేయాలి
అనధికార కోచింగ్ సెంటర్లను అరికట్టాలన్నారు. పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయుల నియామకానికి పోలీసు శాఖ నుంచి అభ్యంతర పత్రాన్ని పొందాలన్నారు. పాఠశాల, కళాశాల భవనాలపై విద్యుత్ వైర్లు ఉంటే వాటిని తొలగించాలన్నారు. అన్ని విద్యా సంస్థల కార్యాలయాల ప్రాంగణాల్లో చైల్డ్ హెల్ప్లైన్ నంబర్, బాల్య వివాహంపై నేమ్ప్లేట్, గోడ రాతలు తప్పనిసరిగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గదుల్లో బోధనను నివారించాలి. విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాధికారి ఎంఎస్ దివాకర్, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా, జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు, మహిళ, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్వేత, జిల్లా బాలల రక్షణ అధికారి సుదీప్ ఉంకి సహా జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అధ్యక్షుడు నాగనగౌడ

విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దండి