
హిందువుల ఆశీర్వాదంతోనే నేను క్షేమం
హుబ్లీ: హిందువుల ఆశీర్వాదంతోనే తాను సురక్షితంగా ఉన్నానని అంతర్జాతీయ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన విషయాలను ప్రస్తుతం ప్రస్తావించడం సరికాదు. కాంగ్రెస్ హయాంలో ఎటువంటి సమస్య జరగలేదన్నారు. రామమందిర నిర్మాణం చేయడమే తమ ఉద్దేశం. ఆ కార్యం ప్రస్తుతం ముగిసింది. నేడు కోట్లాది మంది హిందువులకు సాయపడే పని ప్రారంభించాలి. హిందూ హెల్ప్లైన్ ప్రారంభించాను. హిందువులు ఎవరూ ఆకలితో అలమటించరాదు. అందుకోసం పేద హిందువులకు ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. అలాగే ఉచిత ఆరోగ్య సేవలు కూడా అందిస్తున్నాం అన్నారు.
హిందూ పార్టీ ప్రారంభించే ఉద్దేశం లేదు
హిందూ పార్టీ ప్రారంభించే ఉద్దేశం లేదు. భారతే ఓ హిందూ దేశం. దీన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దే అవసరం లేదు. 1947 నుంచి భారత్ దూసుకెళుతోంది. అనేక రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్ గొప్ప దేశంగా నిలిచింది. దీన్ని రాజకీయ పార్టీలతో గొప్ప దేశంగా చేయడం సరికాదన్నారు. మేము పేరు కోసం ఆందోళన చేయడం లేదు. రామ మందిరం కోసమే చేశాం. అది విజయవంతం అయింది. హిందువులపై నకిలీ కేసులు పెట్టరాదు. పెడితే మేం పోరాటం చేస్తాం. దేశంలో అనేక చోట్ల హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో హిందువుల రక్షణ కోసం పోరాడతాం. దేశంలో హిందువులు సురక్షితంగా ఉండాలని ఆయన తెలిపారు.
సిందూర్ త్వరగా ముగుస్తుందనుకోలేదు
ఆపరేషన్ సింధూర్ను ఇంత త్వరగా ముగిస్తారని ఎవరూ అనుకోలేదు. ఆ దేశంపై మరింతగా దాడులు చేయాల్సింది. పాకిస్తాన్లోకి దూసుకెళ్లి దాడి చేయడం మంచిదే. మరిన్ని దాడులు చేసి ఉంటే ప్రజలు సంతోషించే వారు. దేశంలో సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టింది. హిందువుల సంతానోత్పత్తి 1.7 శాతంగా ఉంది. ఇది యావత్ దేశానికి మంచి పరిణామం కాదు. ప్రతి హిందువు ముగ్గురు పిల్లలను కంటే హిందువు బాగుంటాడని తన ఉద్దేశం అని ఆయన వెల్లడించారు.