
పాఠశాల పైకప్పు కూలి బాలుడికి గాయాలు
బళ్లారిఅర్బన్: తాలూకాలోని సిరవార గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ గది పైకప్పు కూలడంతో బాలుడి తలకు తీవ్రంగా గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. మూడో తరగతి విద్యార్థి సోమలింగప్ప గాయపడ్డాడు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం 800 విద్యార్థులు దాఖలయ్యారు. కొత్తవి 10, అలాగే పాతవి 9 గదులతో కలిపి పాఠశాలలో 19 గదులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెగని వానలతో నాలుగు గదులు పూర్తిగా శిథిలం అయ్యాయి. దీంతో ఎల్కేజీ, యూకేజీ, 1 నుంచి 3వ తరగతి వరకు తరగతుల విద్యార్థులకు పాఠాలను పాఠశాల ఆవరణలోని చెట్ల కిందే బోధిస్తున్నారు. సోమలింగప్ప అనే విద్యార్థి శిథిలం అయిన గదిలోకి ఉదయం ప్రవేశించిన వేళ పైకప్పు కూలి తలకు గాయాలయ్యాయి. 2009లో పాత 9 గదులను నిర్మించినట్లు అధికారి తెలిపారు. కాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప సోమవారం పాఠశాలలో అన్ని సమస్యలను పరిశీలించి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసి అధికారులతో చర్చలు కూడా జరిపారు. అయినా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల గదుల దుస్థితి గురించి అధికారులు మంత్రికి సక్రమంగా వాస్తవాలను వెల్లడించలేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.