
తుంగభద్ర డ్యాం కళకళ
సాక్షి, బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయంలో రోజు రోజుకు నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన పశ్చిమ కనుమలు, శివమొగ్గ జిల్లాల్లో జోరుగా వర్షాలు రావడంతో డ్యాంకు నీటి ప్రవాహం పెరిగింది. జలాశయం సామర్థ్యం వంద టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 25 టీఎంసీలకు చేరినట్లు డ్యాం అధికారులు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో మరో 15 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గేట్లు భద్రమేనా?
గత ఏడాది డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని కాపాడారు. డ్యాంలోని 33 గేట్లు పూర్తిగా పాతబడ్డాయి, కొత్త గేట్లు అమర్చాలని నిపుణులు అనేకసార్లు స్పష్టంచేశారు. గేట్లను మార్చడం ఇప్పట్లో జరిగేలా లేదని, డ్యాం పూర్తిగా నిండితే పరిస్థితి ఏమిటని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. జూన్ ఆఖరుకల్లా 50 టీఎంసీలు చేరే అవకాశముంది. రైతులు పొలం పనులు ప్రారంభించారు, కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్ పంట త్వరగా పూర్తయితే తదుపరి రబీ పంటలు కూడా పండించుకోవడం సులభమవుతుందని చెబుతున్నారు.
జలాశయంలో నీటిమట్టం
ఎగువన వర్షాలతో నీటి రాక
25 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
నీటి విడుదలకు రైతుల డిమాండ్లు
గేట్ల భద్రతపై కలవరం

తుంగభద్ర డ్యాం కళకళ