శివాజీనగర: బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్ల నేతృత్వంలో జరిగిన ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఆర్సీబీ జట్టు విజయోత్సవాలలో చిన్నస్వామి క్రీడామైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు బలయ్యారు, వీరి మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. నైతిక బాధ్యత వహించి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, హోం మంత్రి జీ.పరమేశ్వర్ పదవుల నుంచి తప్పుకోవాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. విజయేంద్ర, మాట్లాడుతూ విజయోత్సవంలో సీఎం, డీసీఎం సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి పోటీ పడి అంతమంది చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ఇటువంటి మొండి సీఎం, డీసీఎంను తాను ఎక్కడా చూడలేదు. ప్రభుత్వమే 11 మందిని హత్య చేసింది. కాబట్టి రాజీనామా చేయాలని, లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కప్ గెచిలింది ఆర్సీబీనా, ప్రభుత్వమా అన్నది తెలియటం లేదు. గవర్నర్ను ముఖ్యమంత్రే కార్యక్రమానికి పిలిచారు. ఇదొక వినాశకర సర్కారని అశోక్ ధ్వజమెత్తారు. తెలంగాణలో తొక్కిసలాట జరిగితే ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను జైలుకు పంపించారు, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, సిగ్గుండాలి.. అని దుయ్యబట్టారు. అక్టోబర్కల్లా ఈ ప్రభుత్వం పతనమవుతుందన్నారు.
వ్యంగ్య నాటకం
ఈ సందర్భంగా కార్యకర్తలు వ్యంగ్య నాటకాలను ప్రదర్శించారు. ఆర్సీబీ కప్ నాదంటే నాదని లాక్కోవడానికి సిద్దు, శివకుమార్ వేషధారులు ప్రయత్నించడం అందరికీ నవ్వులు పంచింది. తరువాత ఫ్రీడం పార్కు నుంచి సీఎం ఇల్లు ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. వ్యాన్లోకి ఎక్కించి తరలించారు.
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నేతల ధ్వజం
తొక్కిసలాట ఘటనను నిరసిస్తూ బృహత్ ధర్నా
శివాజీనగర: చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రాజీనామా కోరే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. మంగళవారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో పర్యావరణ దినాచరణలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. యూపీ కుంభమేళలో తొక్కిసలాట అయింది. ఇటీవల అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలో వంతెన కూలిపోయి పలువురు చనిపోయారు. బిహార్లో వంతెన ప్రారంభానికి ముందుగానే కూలిపోయి 140 మంది మృతిచెందారు. గోద్రాలో దుర్ఘటన జరిగింది, రైలు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు, వీటికి ఎవరు బాధ్యులు, వీరంతా రాజీనామా చేశారా అని ధ్వజమెత్తారు. బీజేపీవారు తొక్కిసలాట ఘటనను రాజకీయం చేస్తున్నారు. వీరికి నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేశాం, ఉన్నత విచారణ జరిపిస్తున్నాం, ఇది కనిపించదా అని ప్రశ్నించారు.
ఆ దుర్ఘటనలు జరిగితే రాజీనామా చేశారా?
సీఎం సిద్దు ప్రశ్న
తప్పు చేశారు.. తప్పుకోండి
తప్పు చేశారు.. తప్పుకోండి