
టూరిస్టుల కారు నుజ్జు
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కల్లత్తగిరి ఫాల్స్ చూడడానికి వెళ్లిన పర్యాటకుల కారుపై చెట్టు కూలింది. కారు నుజ్జునుజ్జుకాగా, అందులో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. కారును రోడ్డు పక్కలో వదిలి ఫాల్స్ను చూస్తుండగా చెట్టు కూలింది. కారులో తాము లేకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. లింగదహళ్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
శాకంబరీ దేవి దర్శనం
బనశంకరి: బనశంకరిదేవి సన్నిధిలో వెలసిన శాకంబరీ దేవి కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మంగళవారం వేకువజామున సుప్రభాత సేవ తరువాత అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో శాకంబరీదేవి మూలవిరాట్కు అభిషేకం, అర్చన చేపట్టి వివిధ రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
డీకే సురేశ్కు ఈడీ పిలుపు
శివాజీనగర: ఐశ్వర్య గౌడ అనే కిలాడీ మహిళ బంగారు వ్యాపారి నుంచి రూ.9.82 కోట్ల నగలు కొట్టేసిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ డీ.కే.సురేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలుపు అందింది. జూన్ 19న బెంగళూరులో ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. జూన్ 23 అయితే హాజరవుతానని ఈడీకి చెప్పానని సురేశ్ తెలిపారు. తాను సురేశ్ సోదరినంటూ అనేకమంది నగల వ్యాపారుల నుంచి కోట్లాది రూపాయల నగలను కొట్టేసిన కేసుల్లో ఐశ్వర్యగౌడ నిందితురాలు, ఆమె ఇళ్లలో ఈడీ సోదాలు చేసి అరెస్టు కూడా చేసింది. ఇప్పుడు సురేశ్కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
విదేశీయుల నిర్బంధం
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 11మంది విదేశీయులను సీసీబీ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. డీజే హళ్లి పీఎస్ పరిధిలో తలదాచుకున్న ఇద్దరిని పట్టుకున్నారు, వీరిలో ఒకరిపై డీజే హళ్లి పోలీస్స్టేషన్ ధ్వంసం కేసుతోపాటు నాలుగు కేసులు ఉండడం గమనార్హం. మరొకరిపై ఓ కేసు ఉంది. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో తలదాచుకున్న ముగ్గురు విదేశీయులను పట్టుకుని విచారణ చేపట్టారు. మరో నలుగురు ఎటువంటి పత్రాలు చూపించని కారణంగా వారిని నిర్బంధ కేంద్రానికి తరలించారు. వీసా గడువు ముగిసినా ఉంటున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
థగ్ లైఫ్ను అడ్డుకోవద్దు
● సుప్రీం ఆదేశం
శివాజీనగర: ఎట్టకేలకు కర్ణాటకలో తమిళ డబ్ సినిమా థగ్ లైఫ్కు ఊరట దక్కింది. ఈ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో నటుడు కమల్హాసన్ బృందానికి ఉపశమనం దక్కింది. సినిమా ఇష్టం లేకపోతే చూడకండి. అయితే విడుదలను అడ్డుకోవటం సరికాదు అని కోర్టు పేర్కొంది. కన్నడ భాషను కించపరిచేలా కమల్ మాట్లాడారని ఈ చిత్రం రాష్ట్రంలో విడుదల కాకుండా కన్నడ, ప్రజా సంఘాలు అడ్డుకోవడం తెలిసిందే. క్షమాపణ చెప్పడానికి కమల్ తిరస్కరించడంతో విడుదల కాలేదు. హైకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించగా ఉపశమనం లభించింది. సినిమా సజావుగా ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది.

టూరిస్టుల కారు నుజ్జు

టూరిస్టుల కారు నుజ్జు