కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరపాలకసంస్థ 53వ డివిజన్ సాయినగర్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కనాటారు. డివిజన్వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్నారు. భవిష్యత్లో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలు పునిచ్చారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న అనుకూల సమయంలో మొక్కలు నాటితే అవి సులభంగా పెరిగే అవకాశముందని అన్నారు. నగర ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటా లన్నారు. కార్పొరేటర్లు కొంపెల్లి శ్వేత రమన్, వంగల పవన్ కుమార్ పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి బాగ్యలక్ష్మి సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో ‘రైతు నేస్తం 100’ వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఏవో మాట్లాడుతూ వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ, ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ కోఆర్డినేటర్ డా.పిమధుకర్ రావు, డీహెచ్ఎస్వో జగన్ మోహన్ రెడ్డి, ఏడీఏ రణధీర్, ఏవో సంతోష్, హార్టికల్చర్ అధికారి స్వాతి, ఏఈవోలు ఫజిల్, రాజశేఖర్, ఫరీద్ పాల్గొన్నారు.
కరీంనగర్: వర్షాకాలం సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో శ్రీరాం సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం పీహెచ్సీ డాక్టర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ముందస్తు నివారణ చర్యలు, ఫీవర్ సర్వేలు, లార్వా నిర్మూలన, తాగునీటి నాణ్యత పర్యవేక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు డెంగీ, మలేరియా వంటి నీటి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు, గర్భిణుల నమోదు, చిన్నారులకు వ్యాక్సినేషన్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు సనజవేరియా, రాజగోపాల్, విప్లవ శ్రీ, శైలేందర్, ప్రభుదాస్ పాల్గొన్నారు.
కరీంనగర్ కల్చరల్: ప్రముఖ సాహితీవేత్త ఎంవీ.నరసింహారెడ్డి తన జీవితకాలంలో చేసిన అక్షర సేవ ప్రశంసనీయమని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి దాస్యం సేనాధిపతి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన ఎంవీ.నరసింహారెడ్డి సంస్మరణసభలో మాట్లాడారు. తెలుగు భాషను కాపాడేందుకు తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం ఏర్పాటు చేసి, వ్యవస్థాపక అధ్యక్షుడిగా అమూల్య సేవలు అందించారని కొనియాడారు. తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్రెడ్డి, కార్యదర్శి బొమ్మకంటి కిషన్, ప్రముఖ సాహితీవేత్తలు అన్నాడి గజేందర్రెడ్డి, చిందం సునీత, నీలగిరి అనిత, బుర్ర విజయలక్ష్మి, గుండు రమణయ్య, గంప ఉమాపతి, ఎండీ ఖాలీద్ పాల్గొన్నారు.


