కరీంనగర్కల్చరల్: తెలంగాణ అస్తిత్వం ఉన్నంతకాలం మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్యం చిరస్థాయిగా నిలిచిపోతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో భగవతి పాఠశాలలో ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు మరింగంటి అనంతాచార్యులకు దాశరథి కృష్ణమాచార్య రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసి మాట్లాడారు. సత్తు మల్లేశ్ మాట్లాడుతూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలంతో పోరాడిన మహాకవి దాశరథి తెలంగాణ కవిత్వానికి అగ్నితేజమని కొనియాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు దాశరథి జీవిత విశేషాలు, సాహిత్య సేవలను పరిచయం చేయాలన్నారు. దాశరథి సాహిత్యాన్ని భావితరాలకు చేరవేయాలంటే ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భగవతి పాఠశాల చైర్మన్ బి.రమణారావు, కవులు దాస్యం సేనాధిపతి, కలువకుంట రామకృష్ణ, కె.ఎస్.అనంతాచార్య, మహ్మమద్ ఖాలీద్, కాండూరి వెంకటేశ్వర్లు, దొమ్మటి శంకర్ పాల్గొన్నారు.
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్న గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని సప్తగిరి హిల్స్ రోడ్డు నంబర్ 1,2,3,4, తాహెరా మజీద్, శ్రీనగర్కాలనీ, సంతోషిమాత ఆలయం, భవానీకాలనీ, మల్లికార్జునకాలనీ, జానకీ వీధి, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టౌన్ 8 సెక్షన్పరిధిలోని షాషామహల్, లక్ష్మీనగర్, కోతిరాంపూర్, గాయత్రీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2, 1 ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
కొత్తపల్లిలో..
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.కొత్తపల్లి టౌన్ ఫీడర్ పరిధిలోని కొత్తపల్లి(హవేలి)లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
మూడు రోజుల్లో 95శాతం ఎస్ఐఆర్ పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో మరో మూడు రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ 95శాతం పూర్తి చేయాలని ఈఆర్వో, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. బుధవారం రాత్రి నగరపాలకసంస్థ కార్యాలయం నుంచి బీఎల్వో, సూపర్వైజర్లు, మానిటరింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పోలింగ్ బూత్ పరిధిలో తక్కువ ప్రక్రియ నమోదు అయిందో, ఆ బూత్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను మ రింత వేగవంతం చేయాలని, నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.


