సిరిసిల్ల క్రికెట్‌ సంచలనం అవనీశ్‌రావు | - | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల క్రికెట్‌ సంచలనం అవనీశ్‌రావు

Jun 8 2026 11:36 PM | Updated on Jun 8 2026 11:36 PM

సిరిసిల్ల క్రికెట్‌ సంచలనం అవనీశ్‌రావు రికార్డు ధర పలికిన అమన్‌రావు కరీంనగర్‌ ఖ్యాతి పెరిగింది

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లికి చెందిన పెరాల అమన్‌రావు వేలంలో రూ.12 లక్షలకు వరంగల్‌ వారియర్స్‌ జట్టుకు ఎంపికై జిల్లాలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అమన్‌రావు ఇప్పటికే దేశీయ క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రూ.30 లక్షలకు ఇతడిని సొంతం చేసుకుంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైపై శార్దూల్‌ఠాకూర్‌ ఓవర్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడం, విజయ్‌ హజారే ట్రోఫీలో బెంగాల్‌ అంతర్జాతీయ బౌలింగ్‌ లైన్‌అప్‌ (షమీ, ఆకాష్‌దీప్‌, ముఖేశ్‌కుమార్‌) పై ఏకంగా 200 (నాటౌట్‌) పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ అండర్‌–23 జట్టుతో పాటు రంజీ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు, టీజీ–20 లీగ్‌లో మహమ్మద్‌ సిరాజ్‌తో కలిసి వరంగల్‌ వారియర్స్‌ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలు ఉండటం విశేషం.

రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్‌గల్‌కుకు చెందిన అరవెల్లి అవనీశ్‌రావు ప్రతిభావంతమైన వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువతో కఠిన శ్రమకోర్చి, స్థానిక మైదానాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎదిగాడు. అండర్‌–19 వరల్డ్‌ కప్‌– 2024లో భారత జట్టు తరఫున వికెట్‌ కీపర్‌గా ఎంపికై , జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌ 2024లో సీఎస్‌కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2024లో ఐపీఎల్‌ వేలంలో చైన్నె సూపర్‌కింగ్స్‌ అవనీశ్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.7 లక్షలకు ప్రణవ రంగారెడ్డి రైజర్స్‌ జట్టు సొంతం చేసుకుంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఆరుగురు యువ క్రికెటర్లు ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్‌కు ఎంపికవడం అభినందనీయం. ప్రతిష్టాత్మకంగా జరిగే లీగ్‌లో పాల్గొనడంతో జిల్లా క్రికెట్‌ ఖ్యాతి పెరిగింది. మన క్రికెటర్లు లక్షల ధర పలకడం గర్వంగా ఉంది. లీగ్‌లో అద్భుతంగా రాణించి జిల్లా కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం.

– మనోహర్‌రావు, జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి, కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement