కరీంనగర్టౌన్: చేనేత కార్మికుల పొట్ట కొట్టే ప్రభుత్వ సమీకృత టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు రామచంద్రం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కరీంనగర్ పద్మనగర్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. 24 ఏళ్లుగా చేనేత సహకార సంఘాల్లోని కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో, టెస్కో సంస్థలు కొనుగోలు చేసేవని గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సమీకృత టెండర్ల ద్వారా వస్త్రాలను కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం టెండర్ విధానాన్ని రద్దుచేసి కార్మికులకు చేతినిండా పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సహకార సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. ఆప్కో మాజీ డైరెక్టర్ అడిగోప్పల సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు వెంకటేశం, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.


