కరీంనగర్: హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ (హెచ్ఏఎఫ్) పేరుతో నిబంధనలకు వ్యతిరేకంగా సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ తెలిపారు. సోమవారం కరీంనగర్లో మాట్లాడారు. హెచ్ఏఎఫ్తో ఐఎంఏ, తానాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెచ్ఏఎఫ్ వ్యవస్థాపకుడు, వన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మహేశ్వర్రెడ్డి అనుచరులు మల్యాల మండలం రామన్నపేటలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు కారును అడ్డగించి దాడికి యత్నించడం, దాడికి పాల్పడినవారే కేసులు పెట్టడంపై మండిపడ్డారు. హెచ్ఏఎఫ్ ఏర్పాటును సీరియస్గా తీసుకున్న పోలీసులు వ్యవస్థాపకులను మందలిస్తే బీఎన్ రావుపై కక్షగట్టడమేమిటని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆర్మీ ఏర్పాటు చేసి వైద్యవృత్తిని శాసించాలనుకోవడం మూర్ఖపు చర్య అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఐఎంఏలో చర్చించి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కటారి, జిల్లా అధ్యక్షుడు ఎనమల నరేశ్, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, కార్యదర్శి మహేశ్, కోశాధికారి నీలిమ, ఆర్.వెంకటేశ్వర్లు, వంశీ తదితరులు పాల్గొన్నారు.


