మల్లాపూర్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఒబులాపూర్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తదాంరాజుపల్లికి చెందిన ఇల్లెందుల సత్తయ్య, పద్మ పెద్ద కుమారుడు వంశీ (26) బీటెక్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లేందుకు రూ.1.50లక్షలు ఏజెంట్కు చెల్లించాడు. సదరు ఏజెంట్ గల్ఫ్కు పంపకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఒబులాపూర్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఉరేసుకున్నాడు. మల్లాపూర్ ఇన్చార్జి ఎస్సై గంగాధర్ ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మనస్తాపంతో రైతు..
చొప్పదండి: చేసిన అప్పులు తీర్చడానికి వ్యవసాయ భూమి అమ్ముకొని మనస్తాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చొప్పదండ మండలంలోని చాకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చాకుంట గ్రామానికి చెందిన మద్దం నర్సయ్య(62) గతంలో డైరీఫార్మ్ నిర్వహించి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి తనకున్న వ్యవసాయ భూమిని అమ్ముకున్నాడు. ఉన్న భూమి అప్పులకిందికే పోవడంతో మనస్థాపానికి గురై ఈ నెల 6న గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు ముద్దం నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


