సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల స ర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. మూడెకరాల భూమి కొ లిచేందుకు రూ. 25వేలు డిమాండ్ చేసి, రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధి కారుల వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి రెవెన్యూ శివారులో వ్యవసాయ భూమి ఉంది. మూడు ఎకరాల భూమి విషయంలో ఇతరులతో వివాదం ఏర్పడగా.. సర్వే చేయాలని గత నెల 17న సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామికి దరఖాస్తు చేసుకున్నాడు. కుమారస్వామి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. గత నెల 23న రూ.5వేలు బాధితుడు ఫోన్పే చేశాడు. ఈనెల 2న కుమారస్వామికి ప్రైవేటు సహాయకుడిగా ఉన్న విహీత్రెడ్డి ద్వారా రూ.10వేలు ఇచ్చాడు. మిగతా రూ.10 వేలు ఇస్తేనే సర్వే చేస్తాననడంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సోమారం చౌరస్తా వద్ద కుమారస్వామి రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐలు పున్నం చందర్, ప్రేమ్కుమార్ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సొమ్ము స్వాధీనం చేసుకొని, తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత రికార్డులు సీజ్ చేశారు. కుమారస్వామితో పాటు అతని ప్రైవేటు సహాయకులు రాజేశ్, విహీత్రెడ్డిలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబరు 1064, 9440446106 నంబర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మూడు ఎకరాలు కొలిచేందుకు రూ.25 వేలు డిమాండ్
రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు


