భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్న వ్యక్తిపై దాడి
జగిత్యాలక్రైం: భార్య, మూడేళ్ల కూతురు ఉండగా విడాకులు తీసుకోకుండానే మరో యువతిని ప్రేమ పేరుతో వివాహం చేసుకున్న వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో సఖీ కేంద్రం వద్ద జరిగింది. వివరాలు.. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్, ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల కూతురు ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా, అనిల్ కరీంనగర్ మండలానికి చెందిన యువతిని ప్రేమపేరుతో వంచించి ఈనెల 21న పెళ్లి చేసుకున్నాడు. విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో మల్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనిల్ను, పెళ్లి చేసుకున్న యువతిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా, అనిల్కు భార్య, కూతురు ఉందని తెలియడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని పోలీసులు జగిత్యాల సఖీ కేంద్రానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం సఖీ కేంద్రానికి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకోగా కేంద్రం నిర్వాహకులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా అనిల్ వెళ్లి గొడవకు పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు అనిల్పై దాడి చేశారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, కుమారస్వామి ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన అనిల్ను జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. అనిల్ తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు ఆరుగురితో పాటు, మరికొంత మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణసీఐ తెలిపారు. కాగా, కులాంతర వివాహం చేసుకోవడం వల్లే దాడి జరిగిందని వదంతులు రావడంతో పోలీసులు అప్రమత్తమై లోతైన విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగుచూశాయి. అనిల్కు భార్య, కూతురు ఉండగా ప్రేమ వివాహం చేసుకోవడం చట్టరీత్య నేరం కావడంతో యువతికి సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.
సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా ఘటన
భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్న వ్యక్తిపై దాడి


