ఆర్టీసీ కార్మికుల పోరుబాట
కరీంనగర్టౌన్: ఆర్టీసీ కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణ చేస్తూ ఫిట్మెంట్ అమల చేయాలనే తదితర డిమాండ్లతో మంగళవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీచలో సెక్రటేరియట్శ్రీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి తరలిరావాలని ఆర్టీసీ జేఏసీ పక్షాన కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో పోస్టర్ ఆవిష్కరణలు, గేట్ మీటింగులు నిర్వహించి కార్మికులకు సన్నద్ధం చేశారు.
సమస్యలు పరిష్కరించాలని..
సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఆర్టీసీ ఎండీకి వినతిపత్రాలిచ్చారు. పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలన్ని జేఏసీగా ఏర్పడ్డాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, కారుణ్య పద్ధతిలో నియామకం అయినవారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలనే తదితర డిమాండ్లతో ఆందోళనబాట పట్టారు. రీజియన్ పరిధిలో అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి జిల్లా చైర్మన్గా ఎంపీ రెడ్డిని ఎన్నుకున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండరాదన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్ నాయకులు ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఆర్టీసీ మేనేజ్మెంట్కు గతంలో ఎన్నోసార్లు విన్నవించాం. హమీలు అమలు చేయకుండా మేనిఫెస్టోలో పెట్టిన హమీలను ఉల్లంఘిస్తూ ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అప్పగించే ప్రయత్నాలు మానుకోవాలి. అన్ని రకాల బకాయిలు కార్మికులకు వెంటనే చెల్లించాలి. 2021 పేస్కేల్ ఇవ్వాలి. కార్మికులను గేట్మీటింగ్ల ద్వారా యాజమాన్యం వేధించడం, భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. మంగళవారం ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించనున్న చలో సచివాలయానికి కార్మికలోకం పెద్దఎత్తున కదలిరావాలి.
– ఎంపీ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ జిల్లా చైర్మన్
ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన హమీలు అమలు చేయాలి. పనిభారం తగ్గించి, కక్ష సాధింపు చర్యలను నిరోధించాలి. డిపోల పరిధిలో కార్మిక సంఘాల కార్యక్రమాలను అనుమతించాలి. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీలను రద్దు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. పీఎఫ్, సీసీఎస్లకు వడ్డీ సహా డబ్బు చెల్లించాలి. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ, డిపోల మూసివేతను ఉపసంహరించుకోవాలి. కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. టికెట్ తీసుకోకుంటే ప్రయాణికుడినే బాధ్యుడిని చేయాలి. 2017, 2021 వేతన సవరణ చేయాలి. 2019 నుంచి రావల్సిన డీఏ చెల్లించాలి. 2019 సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి. ఉద్యోగ విరమణ చేసిన వారికి సెటిల్మెంట్లను తక్షణమే చెల్లించాలి. అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. పాత రెగ్యులేషన్స్ సమూలంగా మార్చి డ్రైవర్, కండక్టర్, మెయిన్టెనెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. మృతి చెందిన ఉద్యోగులు, మెడికల్ అన్ ఫిట్ అయిన వారిస్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
నేడు చలో సెక్రటేరియట్కు పిలుపు
హమీల అమలుకు డిమాండ్
ఆర్టీసీ కార్మికుల పోరుబాట


