ఎంసీహెచ్
ఎంసీహెచ్లో అందించే సౌకర్యాలు
అమ్మఒడి..
శిశువుకు పాలు పట్టిస్తున్న నర్సింగ్ సిబ్బంది
కరీంనగర్: తల్లి గర్భం నుంచి ప్రసూతి తరువాత లోకాన్ని చూసే నవజాత శిశువులు కంటిపాప లాంటివారు. తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలోనే ప్రపంచాన్ని చూసుకున్న వారు భూమిపైకి వచ్చాక కొంతకాలం వాతావరణాన్ని తట్టుకోలేరు. ఇలాంటి సమయాల్లో తల్లి పొత్తిలే బిడ్డకు రక్షణ కవచంగా ఉంటుంది. అయితే అనారోగ్యం, బరువు తక్కువగా, నెలలు నిండకముందే పుట్టిన శిశువులు తల్లి పొత్తిళ్లలో ఆరోగ్యంగా ఉండలేరు. ఇలాంటి నవజాత శిశువులకు కరీంనగర్ ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో ఏర్పాటు చేసిన స్పెషల్ న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎస్ఎన్ఐసీయూ) ఆశాకిరణంగా మారింది. పుట్టిన బిడ్డ ఎలాంటి స్థితిలో ఉన్నా ఇక్కడి సిబ్బంది అత్యాధునిక చికిత్స అందిస్తూ ఉపిరి పోస్తున్నారు.
ఆరు జిల్లాలకు కీలకం..
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది గర్భిణులు, నవజాత శిశువులకు కరీంనగర్ ఎంసీహెచ్ అండగా నిలుస్తోంది. సరైనసదుపాయాలు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది, సమయానుకూల సేవలు అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట ల భిస్తుండడంతో పేద, మధ్యతరగతి తేడా లేకుండా ఎంసీహెచ్ సేవలు వినియోగించుకుంటున్నారు.
అత్యాధునిక సౌకర్యాలు
కరీంనగర్ ఎంసీహెచ్లోని ఎస్ఎన్ఐసీయూలో 20 వార్మర్లు, ఐదు ఫొటోథెరఫీ, ఐదు వెంటిలేటర్ యూనిట్ల ద్వారా నవజాత శిశువులను చికిత్స అందిస్తున్నారు. 650 గ్రాముల బరువుతో పుట్టిన పిల్లలకూ ఊపిరి పోస్తున్నారు. ఎంసీహెచ్లో డెలివరీ అయిన మహిళల పిల్లలనే కాకుండా ఇతర జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికీ చికిత్స అందిస్తున్నారు. ఒక్కో శిశువుకు ఆరోగ్య పరిస్థితిని బట్టి 5 నుంచి 10 రోజులు చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో పంపిస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ
ప్రత్యేక శిశు వైద్య నిపుణులు, అనుభవజ్ఞులైన నర్సింగ్ సిబ్బంది ప్రతి శిశువుకు వ్యక్తిగత శ్రద్ధతో సేవలందిస్తున్నారు. తక్కువ బరువు, ప్రీమేచ్యూర్ బేబీలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అత్యవసర చికిత్స అందింది, ప్రాణాలు కాపాడుతున్నారు. గతంలో కరీంనగర్, పరిసర ప్రాంతాల్లో పుట్టిన శిశువులకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడితే హైదరాబాద్కి తరలించాల్సి వచ్చేది. ప్రయాణ ఇబ్బందులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంసీహెచ్లోనే పైసా ఖర్చు లేకుండా శిశువులకు చికిత్స అందిస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది శిశువుకు ఆకలేస్తే పాలు పట్టిస్తూ, ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ.. కరీంనగర్ ఎంసీహెచ్ను అమ్మఒడిగా మార్చుతున్నారు.
వార్మర్లు : 20
ఫొటోథెరపీ : 05
ఆక్సిజన్ వెంటిలేటర్ బెడ్లు : 05
చికిత్స పొందుతున్న శిశువులు: ప్రతి నెల 180 మంది
ఎంసీహెచ్


