అమ్మోనియం సల్ఫేట్!
వీణవంక: వరి ఎదుగుదలకు రైతులు ‘అమ్మోనియం సల్ఫేట్’ను విచ్చలవిడిగా వాడుతున్నారు. యాసంగి నాటువేసిన 30 నుంచి 40రోజుల మధ్య యూరియాతో కలిపి సల్ఫేట్ చల్లుతున్నారు. అమ్మోనియం సల్ఫేట్ బస్తాల వాడకం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. నేలను దెబ్బతీయడంతో పాటు వేరు వ్యవస్థ నల్లబడి పోయి భూసారంపై ప్రభావం చూపుతుందంటున్నారు. జిల్లాలో ఏటా 1,300 మెట్రిక్ టన్నుల అమ్మోనియం చల్లుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎకరాన 50కిలోల చొప్పున వేస్తున్నారు. ఒక్కో బస్తా ధర రూ.950 ఉండగా ఇందులో నత్రజని 21శాతం, సల్ఫేట్ 24శాతం ఉంటుంది. దీనికి బదులు సేంద్రియ ఎరువు, యూరియా వాడితే పెట్టుబడి తగ్గడంతో పాటు భూమిని కాపాడుకోవచ్చునని అధికారులు అంటున్నారు. అయితే అమ్మోనియం సల్ఫేట్ను వాడొద్దని వ్యవసాయ అధికారులు చెప్పుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. హైబ్రిడ్ (ఆడ,మగ)వరి కంపెనీల ప్రతినిధులు అమ్మోనియం సల్ఫేట్ వేయాలని రైతులకు సిఫార్సు చేస్తున్నారు. జిల్లాలో 2.74లక్షల ఎకరాలలో వరి సాగవుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో కలుపు తీస్తున్నారు. ఈ సమయంలో మూడోదఫాలో ఆమ్మోనియం సల్ఫేట్తో పాటు యూరియా వేస్తున్నారు. ఈ ఎరువు వేయడం ద్వారా వరి ఏపుగా, గుబురుగా పెరుగుతుందని రైతులు చెప్పుతున్నారు. హైబ్రిడ్వరి జిల్లాలో 1.20లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. అమ్మోనియం తప్పనిసరిగా వేయాలని కంపెనీ ప్రతినిధులు సిఫార్సు చేస్తుండటంతో వాడకం మరింత పెరిగింది. శ్రీఅమ్మోనియం సల్ఫేట్లో గంధకం(సల్ఫర్)ఉండడం ద్వారా నేల సమతుల్యత దెబ్బతింటుంది. అమ్మోనియం సల్ఫేట్ బస్తాకు పెట్టే ధరకు మూడు యూరియా బస్తాలు వస్తాయని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు వివరించారు.


