వీధిరౌడీల్లా కాంగ్రెస్ నేతలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి
కరీంనగర్: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కాంగ్రెస్ శ్రేణుల అరాచకానికి నిదర్శనమని, వాళ్లు వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్పై దాడిని నిరసిస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొ మ్మ దహనం చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి పాలనలో లా అండ్ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. రామచందర్రావును అరెస్టు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు గుగ్గిల్లపు రమేశ్, ఇనుకొండ నాగేశ్వర్రె డ్డి, మాడ వెంకట్రెడ్డి, బోయిన్పల్లి ప్రవీణ్రావు, బండ రమణరెడ్డి, సోమిడి వేణుప్రసాద్, బండారి వేణు పాల్గొన్నారు.
ప్రజావాణి యథాతథం
కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి ఇక యథా విఽథిగా కొనసాగనుంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల క్రమంలో గత కొన్నేళ్లుగా ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. ఎన్నికల కోడ్ క్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం విదితమే. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల కోడ్ ఎత్తివేయగా ఇక ప్రతి సోమవారం ప్రజావాణి యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తులు ఆహ్వానం
విద్యానగర్(కరీంనగర్): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు జి.రాఘవరావు తెలిపారు. చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ, డిజైన్లో నైపుణ్యం కనబరిచిన, సేవలందించిన కళాకారులు తమ దరఖాస్తులను మార్చి 31లోగా సమర్పించాలని సూచించారు. 2025 డిసెంబర్ 31 నాటికి 30ఏళ్లు నిండి చేనేత రంగంలో కనీసం 10ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. చేనేత డిజైనర్లకు 25ఏళ్ల వయస్సు నిండి ఐదేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు ఫారం నింపి, నైపుణ్యతను చాటే నమూనాల శాంపిల్స్ జతచేసి కరీంనగర్ చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
సీసీఐ కొనుగోళ్లు పొడిగింపు
కరీంనగర్ అర్బన్: పత్తి కొనుగోళ్ల గడువు ప్రభుత్వం మరో మారు పొడిగించింది. ఇప్పటికే సీసీఐ కొనుగోళ్లు లేవని మార్కెటింగ్ అధికారులు ప్రకటనలు గుప్పించగా రైతుల ఆందోళనల క్రమంలో దిగొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమైన రైతుల ఆందోళనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఈ నెల 27వరకు పత్తి కొనుగోలు చేస్తుందని ప్రకటించింది.


