
దేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయం
● ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి
కరీంనగర్ కార్పొరేషన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ సాధించిన విజయమని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యార్థులకు వివరించేందుకు భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఎన్ఎస్యూఐ మాజీ ఉపాధ్యక్షుడు ఎండీ ఇమ్రా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాచౌక్ నుంచి సీవీఆర్ఎన్ రోడ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. కులగణన చేపట్టిన నేపథ్యంలో రాహుల్, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశవ్యాప్త కులగణన కోసం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టడం చరిత్రాత్మకమన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే చేపట్టిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా వైట్ టీషర్ట్ మూమెంట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, నగర అధ్యక్షుడు ఉప్పరి విశాల్ పాల్గొన్నారు.