సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే! | - | Sakshi
Sakshi News home page

సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే!

Jun 21 2025 3:17 AM | Updated on Jun 21 2025 3:17 AM

సీసీల

సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే!

● అక్రమాలకు ఆలవాలంగా సీసీలు ● ఐఏఎస్‌లను కీలుబొమ్మలుగా మార్చారన్న విమర్శలు ● భూరికార్డులు మార్చిన ఘనత కూడా వీరికే ● క్రిమినల్‌ కేసులున్నా.. అంటి పెట్టుకుంటున్న కలెక్టరేట్‌ కార్యాలయం ● జిల్లాలో ఏ స్కాం వెలుగుచూసినా.. అభయమిచ్చేది వీరే!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ :

వారు క్యాంప్‌ క్లర్కులే.. హోదా చిన్నదే.. అయితేనేం.. వారి ముందు ఎవరైనా సరే.. అయ్యా..ఎస్‌! అంటూ మోకరిల్లాల్సిందే. వీరి వద్ద ఏం మాయ ఉందో ఏమో తెలియదు కానీ... ఉన్నత చదువులు చదువుకున్న ఆఫీసర్లు కూడా వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిన వైనం ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. వీరు భూరికార్డులను మార్చినా, శ్మశాన వాటికలను మింగేసేవారికి అండగా నిలబడ్డా, చివరికి తోటి తహసీల్దార్‌ భూమిని సైతం ఇతరులకు మ్యుటేషన్‌ చేసే ఘనులు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఎక్కడ ఏం స్కాం వెలుగుచూసినా.. ఇక్కడ ఐఏఎస్‌ల కంటే ముందు వీరి వద్దకే అంతా వస్తారు.. అక్కడే వీరు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఐఏఎస్‌ల టేబుళ్లపై ఏ ఫైల్‌ ఉండాలి? వారు ఏ ఫైల్‌ చూడాలి? ఎవరిని కలవాలి? ఎవరిని కలవద్దు? అన్న విషయాల్లో వీరి నిర్ణయమే ఫైనల్‌. అందుకే, ఎన్ని అవినీతి కేసులు, కుంభకోణాలు వెలుగుచూసినా.. కరీంనగర్‌ జిల్లాలో ఐఏఎస్‌ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడానికి సీసీలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

వీరి గాథలు ఇన్నిన్ని కాదయా?

ఉద్యోగ నిబంధనలు, బదిలీలు, ఎన్నికల కోడ్‌ తదితరాలు వర్తించవు. ఎందుకంటే ఉన్నతాధికారులు వీరి జేబులో ఉన్నారన్న నమ్మకమే ఇక్కడ అక్రమాలకు ఎదురులేకుండా పోతుందన్న విమర్శలు ఉన్నాయి. వీరిలో అందరి కంటే సీనియర్‌ తహసీల్దార్‌ ర్యాంకులో ఓ సీసీ ఉన్నారు. ఆయన 2009 నుంచి ఇక్కడే కొనసాగుతున్నారు. ఆర్‌ఐ ర్యాంకులో సీసీగా వచ్చిన ఈయన ప్రస్తుతం కలెక్టర్‌ కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నారు. తహసీల్దార్‌గా పదోన్నతి వచ్చిన సమయంలో జిల్లాలో ఎక్కడా ఖాళీ లేదు. దీంతో ఆయన పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చింది. ఆలోచించాడు.. చక్రం తిప్పి కరీంనగర్‌ డీఆర్‌డీఏకు ఫారిన్‌ సర్వీస్‌ కింద వచ్చారు. తరువాత మరోసారి స్కెచ్‌ వేసి కలెక్టరేట్‌లో హెచ్‌–విభాగానికి సూపరింటెండెంట్‌గా ఉన్న తహసీల్దార్‌ను బలవంతంగా అక్కడ నుంచి డీఆర్‌డీఏకు పంపారు. ఇక తాను వెళ్లి ఆ పోస్టులో పాగా వేశారు. ఒకసారి కొత్తపల్లికి తహసీల్దార్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి.. కిసాన్‌ నగర్‌లోని తోటి తహసీల్దార్‌ భూమిని ఇతరులకు మ్యుటేషన్‌ చేశాడు. అతనిపై విజిలెన్స్‌ విచారణ జరిపి క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేసింది. అయితే... అపుడు ఈ సీనియర్‌మోస్ట్‌ సీసీ రంగంలోకి దిగి కలెక్టర్‌ కళ్లకు గంతలు కట్టారు. విజిలెన్స్‌ విచారణను తొక్కిపెట్టి సదరు తహసీల్దార్‌ను కాపాడుకున్నాడు.

● కరీంనగర్‌లో ఇలాంటి సీసీలంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి తహసీల్దార్‌ హోదాలో ఉన్న ఓ రాజగురువు తోడున్నారు. ఎవరు ఎక్కడ పనిచేయాలో ఇతను నిర్ణయిస్తాడు. జిల్లాలో ఏ స్కాం వెలుగుచూసినా.. ఇతన్ని సంప్రదిస్తే చాలు.. విచారణ లేకుండా నింది తులందరినీ కాపాడే బాధ్యత ఇతనే భుజాల కెత్తుకుంటాడు. ఈయన శశాంక కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఇదే రాజగురువు ఓ వివా దంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బొమ్మకల్‌లోని ఏడెకరాల భూమిని అక్రమంగా ఇతరులకు విరాసత్‌ చేయడంతో ఆగ్రహించిన కలెక్టర్‌ సదరు రాజగురువును పక్కనబెట్టా రు. ఇటీవల నకిలీ ఫ్యామిలీ లీగర్‌హెయిర్‌ సర్టిఫికెట్‌ కేసులో ఇతనిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదైంది. కానీ...ఇతను అరెస్టు కా కుండా ఉన్నతాధికారులు కాపాడుతున్నార న్న విమర్శలు రావడం దారుణమని సాక్షా త్తూ.. కలెక్టరేట్‌ సిబ్బందే వాపోతున్నారు.

● హెల్త్‌ నుంచి రెవెన్యూకు, రెవెన్యూ నుంచి ఇపుడు మున్సిపాలిటీకి ఇష్టం వచ్చినట్లు ఫారిన్‌ సర్వీసులకు ఇట్టే వెళ్తున్న మరో సీసీ కథలు ఇన్నీఅన్నీకావు. మాతృశాఖ అయిన డీఎంహెచ్‌వోలో సీసీగా ఉన్న సమయంలో కరీంనగర్‌లోని ప్రైవేటు నర్సింగ్‌ హోంల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న కారణంతో అప్పటి డీఎంహెచ్‌వో అతన్ని వావిలాల పీహెచ్‌సీకి బదిలీ చేశారు. అయినా...మనోడు అక్కడ విధులు నిర్వర్తించకుండా తిరిగి రాజగురువు సాయంతో తిరిగి కలెక్టరేట్‌లో ఓ అడిషనల్‌ కలెక్టర్‌ వద్ద సీసీగా మకాం వేశాడు. ఇపుడు అడిషనల్‌ కలెక్టర్‌ బల్దియాకు వెళ్లడంతో అతనితోపాటు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. ఇతని మీద గతంలో ఏసీబీ నిఘా పెట్టిన విషయం తెలిసిందే.

● ఇక బల్దియాలో కొందరు సీసీలు రెండాకులు ఎక్కువే చదివారు. ఇక్కడ పనిచేసే వారు ఔట్‌ సోర్సింగ్‌ అయినా.. మున్సిపల్‌ కమిషనర్లను జేబులో ఉంచుకున్నామని కలరింగ్‌ ఇస్తున్నారు. ఆ ధైర్యంతో కార్పొరేషన్‌లో శాశ్వత సిబ్బందిని, సీనియర్‌ ఇంజినీర్లను అందరి ముందే పేర్లు పెట్టి పిలవడం, ‘నువ్వు’ అని సంబోధించడం వీరికి ఉన్నతాధికారులు ఇచ్చిన స్వేచ్ఛకు నిదర్శనం. బల్దియాలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు మహిళలను పలు రకాలుగా వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా.. వీరిపైనా ఎలాంటి చర్యలు ఉండకపోవడం గమనార్హం.

● మొత్తానికి కరీంనగర్‌ జిల్లా పరిపాలనకు పార్టీలతో, ప్రభుత్వాలతో పనిలేదని.. ఇక్కడ ఏం స్కాం జరిగినా.. నిందితులు సీసీలను ఆశ్రయిస్తే చాలు.. వారే చూసుకుంటారు అన్న ప్రచారం ఉంది. అసలు సీసీల మీదే క్రిమినల్‌ చర్యలున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఇక బయట వారు స్కాంలకు పాల్పడితే మాత్రం ఎలా పట్టించుకుంటారు? అన్న ప్రచారంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

కదలరు.. వదలరు

సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే!1
1/2

సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే!

సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే!2
2/2

సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్‌లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement