
ప్రమాదాలకు నిలయంగా రేకుర్తి వంతెన
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని వంతెనపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం మధ్యాహ్నం ఓ షిఫ్ట్కారు వంతెనపెకి దూసుకెళ్లింది. అదుపుతప్పి వాగులో పడితే పెద్ద ప్రమాదమే జరిగుండేది. ఇలాంటి ప్రమాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నా వంతెనకు రక్షణ చర్యలపై దృష్టి సారించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పురాతన వంతెన
కరీంనగర్ శివారు రేకుర్తిలోని పురాతన వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై గల వంతెన సైడ్బర్మ్స్ శిథిలావస్థకు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిని కలిపే ఈ వంతెనకు మరమ్మత్తులు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈ ప్రధాన రహదారిపై గల పాత వంతెన మీదుగా జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రయాణిస్తుంటాయి. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో తరచూ రేకుర్తి వంతెన సమీపంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గతంలో పలువురు చనిపోగా.. మరికొంతమంది గాయాల బారిన పడి బయటపడ్డారు. అయితే ఇరుకుగా ఉన్న వంతెన గోడలు దెబ్బతినడం..ఇరువైపుల రక్షణగా ఏర్పాటు చేసిన సైడ్బర్మ్స్ను వాహనాలు ఢీకొడుతుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.