
తుదిదశకు కేబుల్ బ్రిడ్జి విచారణ!
కరీంనగర్: కరీంనగర్లోని మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెన పనుల్లో నాణ్యత లోపించిందని, రూ.కోట్ల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన విచారణ తుదిదశకు చేరుకుంది. నెలాఖరులోగా తీగల బ్రిడ్జి పనులపై నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటగా రూ.80కోట్లు కేటాయించగా, అప్రోచ్ రోడ్లతో కలిపి రూ.224 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారు. వంతెనను ప్రారంభించిన నాలుగు నెలల్లోనే తారు దెబ్బతినడం, డిజిటల్ లైట్లు వెలగకపోవడంపై సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిరాద్యులు చేశారు. ప్రభుత్వం తీగల వంతెనకు నిధుల కేటాయింపు, పనులు జరిగిన తీరు, నాణ్యత ప్రామాణాలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్స్పోర్స్మెంట్ రోడ్లు, భవనాలశాఖ విభాగం డీఎస్పీ ఎం.శ్రీనివాస్రావు ఆధ్వర్యంలోని బృందం పనుల నాణ్యతను పరిశీలించారు. విచారణ ఏడాది పాటు కొనసాగిందని, నివేదిక తుదిదశకు చేరుకుందని, నెలాఖరులోగా తుది నివేదిక అందజేసేందుకు సిద్ధం అయినట్లు అధికార వర్గాల వెల్లడించాయి.
విజిలెన్స్ విచారణ హర్షణీయం
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని మానేరువాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన తీగల వంతెన పనుల నాణ్యత, అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టడం హర్షణీయమని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో శనివారం మాట్లాడుతూ.. సీపీఐ చేసిన పోరాటల ఫలితంగా ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించిదన్నారు. తీగల వంతెన నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.