చూస్తే చిల్లరే.. కోట్లలో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

చూస్తే చిల్లరే.. కోట్లలో దోపిడీ

Jun 20 2025 6:26 AM | Updated on Jun 20 2025 6:26 AM

చూస్తే చిల్లరే.. కోట్లలో దోపిడీ

చూస్తే చిల్లరే.. కోట్లలో దోపిడీ

కరీంనగర్‌ అర్బన్‌: కోడి కూర .. ఈ పేరు వింటేనే నోరూరుతోంది. సుట్టమొచ్చినా.. సంతోష వేడుకై నా.. విషాదమైనా ముక్కలు ఉడకాల్సిందే. జిల్లాలో వీటి వినియోగం ఎక్కువ. ఽనిత్యం 40 వేల క్వింటాళ్ల చికెన్‌ అమ్ముడుపోతుండగా.. చికెన్‌ సెంటర్ల నిర్వాహకులకు కాసుల పంటే. పేరుకు పేపర్‌ రేటని చెబుతూ వీలైనంత మేర దండుకుంటున్నారు. పేపర్‌ ధర ఒకటైతే విక్రయించేది మాత్రం కిలోకు రూ.40 అదనం. ఇదేంటంటే మేమింతే..నన్న ఈసడింపు సమాధానం. జిల్లాలో నిత్యం రూ.4.20 కోట్ల వ్యాపారం సాగుతుండగా అదనంగా రూ.1.20 కోట్లు దోచుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు రూ.36 కోట్ల మేర వినియోగదారులను పిండేస్తుండగా నియంత్రించే వారే లేకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

చికెన్‌ సెంటర్లు.. దళారులకే లాభం

కోళ్ల పరిశ్రమ స్వయం ఉపాధిగా వెలుగొందుతుండగా దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అఽధికారం లేదు. హెచరీస్‌, కోళ్ల ఫారం యజమానులు, ట్రేడర్స్‌, చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు ఇలా వినియోగదారులకు చికెన్‌ చేరుతుండగా యజమానుల పరిస్థితి అటుంచితే ట్రేడర్లు, చికెన్‌ సెంటర్ల నిర్వాహకులే ధరలను శాసిస్తున్నారు. సొమ్మొకొడది సోకొకరిదన్నట్లు గంటల వ్యవధిలోనే లాభాలు గడిస్తున్నారు ట్రేడర్లు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు పుట్టుకొస్తుండగా.. చికెన్‌ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేలకు పైగా చికెన్‌ సెంటర్లు ఉండగా ట్రేడర్లు సుమారు 500లకు పైగా ఉన్నారు. కోళ్ల ఫారం యజమానుల నుంచి ఆన్‌లైన్‌ సీఎమ్మార్‌ ధరల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు కిలో కోడి ధర రూ.90 ఉంటే మైనస్‌ 5, మైనస్‌ 10కి తక్కువగా కొనుగోలు చేస్తూ చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులకు రూ.90కి అదనంగా రూ.5, 10కి ఎక్కువగా రవాణా పేరుతో విక్రయిస్తున్నారు. అంటే కిలో కోడికి రవాణా ఖర్చులు పోనూ రూ.15కు అదనంగా విక్రయిస్తున్నారు. ఒక ట్రాలీ ఆటో జాలీలో 300–800ల వరకు కోళ్లను సరఫరా చేస్తారు. ఒక కోడి యావరేజ్‌గా 2.300 కిలోలున్నా.. రూ.30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు ట్రేడర్‌ సరఫరా చేసిన ధరకు రూ.5–10కి ఎక్కువ విక్రయించాలి. కానీ.. ఆచరణలో రూ.30–40వరకు ఎక్కువకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

పుట్టగొడుగుల్లా ట్రేడర్లు

జిల్లాలో పౌల్ట్రీఫాంల నుంచి కోళ్లను కొనుగోలు చేసి చికెన్‌ సెంటర్లకు సరఫరా చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీంతోనే ఎక్కువ లాభం ఉండటం.. మైనస్‌ మంత్రాన్ని జపించడంతో అనతికాలంలో లక్షలు వెనకేస్తున్నారు. ఈ జాబితాలో కోళ్ల ఫారం యజమానులు చేరిపోతున్నారు. ఫారం ద్వారా వచ్చే ఆదాయం కంటే సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండగా అదీ రెండు, మూడు రోజుల్లోనే వస్తుండటంతో ఈ వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు.

పాపం.. కోళ్ల ఫారం యజమానులు

ట్రేడర్లు, చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు, హెచరీస్‌లు వీలైనంత సంపాదిస్తుంటే కోళ్ల ఫారం యజమానులది దారుణ పరిస్థితి. రోజుల వ్యవధిలోనే వారంతా లాభాలు గణనీయంగా పొందుతుంటే పిల్లల నుంచి కోళ్ల వరకు రూపాంతరం చెందే వరకు శ్రమించే యజమానులకు మాత్రం మిగిలేది చిన్నమొత్తమే. జిల్లాలో సుమారు 4 వేల వరకు కోళ్ల ఫారాలున్నాయి. హెచరీస్‌లు కోడి పిల్లలను కోళ్ల ఫాం యజమానులకు సరఫరా చేస్తుండగా 40–45 రోజులకు పెంచి వాటిని సంరక్షించడం చేసే ప్రక్రియ. ఇక దాణా సరఫరా చేసే కంపెనీలు బస్తాలపై ఎలాంటి ముద్రణలు చేయడం లేదు. కేవలం కంపెనీ పేరు మాత్రమే ఉంటుండగా దాణాలో వాడే ముడి పదార్థాలను పేర్కొనడం లేదు. ధర ఉండటం లేదు. కంపెనీని నమ్ముకుని దాణా వేయడమే. ఈ లోపు ఏదైనా వైరస్‌ వచ్చినా.. మొటలిటీ(మరణించడం) జరిగినా రైతు పైనే భారం. ఇవన్నీ తట్టుకుని కోళ్లను విక్రయించే సమయానికి ట్రేడర్ల దోపిడీ అధికమవుతోంది. దీంతో చేసేదీలేక మైనస్‌లకు విక్రయిస్తూ పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా లాభం పొందడం లేదు. కోళ్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి ఆశించిన ప్రయోజనం లేదని ఫారం యజమానులు వాపోతున్నారు.

పౌల్ట్రీ మీట్‌ ఫెడరేషనే మార్గం

కోళ్ల పరిశ్రమపై ఒకప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. ఫారం యజమానులు నష్టపోయినా, ఏవైనా విపత్తులు సంభవించినా అరకొర సాయమందేది. దీనికి తోడు ప్రభుత్వ రాయితీలుండేవి. ప్రభుత్వ కనుసన్నలో 1985 వరకు పౌల్ట్రీ మీట్‌ ఫెడరేషన్‌ ఉండేది. కాలక్రమేణ ఫెడరేషన్‌ కనుమరుగైంది. నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమే కానీ... సంస్కరణలు అవసరమన్నది యజమానుల వాదన. కాగా... కోళ్ల పరిశ్రమ స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్‌ రంగం. వీటి ధరలపై మాకెలాంటి అధికారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ప్రొత్సాహకాలు లేవని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.

ధరలు ఇష్టారాజ్యం.. నియంత్రణ పూజ్యం వినియోగదారులను దోచుకుంటున్న చికెన్‌ సెంటర్లు దళారులదే రాజ్యం.. పేరుకే పేపర్‌ రేట్‌ కానీ అదనమే కోళ్ల ఫారం యజమానులకు అంతంతే

కరీంనగర్‌ రాంనగర్‌కు చెందిన శ్రీధర్‌రావు బంధువులు వచ్చారని చికెన్‌ కొందామని మార్కెట్‌కు వెళ్లాడు. పేపర్‌ ధర(ఆన్‌లైన్‌ సీఎమ్మార్‌) ప్రకారం జనరల్‌ కిలో కోడి ధర రూ.91 ఉండగా కిలో కోడి ధర రూ.120కి విక్రయించారు. పేపర్‌ రేట్‌ కదా ఇదేంటంటే గిట్టుబాటు కాదని సమాధానం. పట్టణంలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం. ఇది ఒక్క శ్రీధర్‌ పరిస్థితే కాదు.. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా చికెన్‌ కొనుగోలు చేసే సగటు వినియోగదారుని పరిస్థితి.

గురువారం ధరలిలా

ఫారం దగ్గర కిలో కోడి రూ.91

చికెన్‌ సెంటర్‌లో కిలో కోడి రూ.113

స్కిన్‌తో రూ.164

స్కిన్‌లెస్‌ రూ.186

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement