మద్యంమత్తులో బైక్‌కు నిప్పు | - | Sakshi
Sakshi News home page

మద్యంమత్తులో బైక్‌కు నిప్పు

Jun 20 2025 6:26 AM | Updated on Jun 20 2025 6:26 AM

మద్యంమత్తులో బైక్‌కు నిప్పు

మద్యంమత్తులో బైక్‌కు నిప్పు

మల్యాల: మండలంలోని రాజారం శివారులో మద్యం మత్తులో ఓ యువకుడు తన బైక్‌కు నిప్పుపెట్టాడు. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధి టీఆర్‌నగర్‌కు చెందిన సలీం గురువారం సాయంత్రం రాజారం శివారులో తన ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. మద్యం మత్తులో దానికి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారంతో బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌, హోంగార్డు నర్సింగరావు సంఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు.

హత్య కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు

జగిత్యాలజోన్‌: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసిన కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జంగిలి మల్లికార్జున్‌ కథనం ప్రకారం.. రాయికల్‌ మండలం ధర్మాజిపేటకు చెందిన సావన్‌వెల్లి రాజుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. ఇద్దరు కూతుళ్లకు పెళ్లయ్యింది. కొడుకు శేఖర్‌ వ్యవసాయంతోపాటు గ్రామంలో కూలీ పనులకు వెళ్లేవాడు. అదే గ్రామానికి చెందిన రాస రాజేశం, బలిజే నాగ భూషణంతో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి కూలీ పనులకు వెళ్తూ.. వచ్చిన డబ్బులతో అందరూ కలిసి జల్సా చేసేవారు. 22 మార్చి 2022న శేఖర్‌ ఇంటి వద్ద ఉండగా.. సాయంత్రం 4 గంటల సమయంలో బలిజే నాగభూషణం వచ్చి శేఖర్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. రాత్రి అయినా శేఖర్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆయన కోసం వెదుకుతుండగా మరుసటి రోజు గ్రామ శివారులో శేఖర్‌ శవమై కనిపించాడు. మృతుడి తల్లి రాజు రాయికల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై పి.కిరణ్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ వై.కృష్ణ కుమార్‌ కేసును దర్యాప్తు చేశారు. మద్యం మత్తులో జరిగిన గొడవలో రాస రాజేశం, బలిజె నాగ భూషణం శేఖర్‌ను హత్య చేసినట్లు తేల్చారు. నిందితులను అరెస్ట్‌ చేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు ఎం. కిరణ్‌కుమార్‌, కె. నరేశ్‌ కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టగా రాజేశం, నాగభూషణంకు ఏడేళ్ల చొప్పున జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు.

ప్రమాదవశాత్తు బావిలో పడి గొర్రెల కాపరి మృతి

ధర్మారం: ధర్మారం మండలం నర్సింగపూర్‌ గ్రామానికి చెందిన పెద్ది మల్లయ్య గురువారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరణించినట్లు ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్‌ తెలిపారు. గొర్రెల కాపలాకు వెళ్లిన మల్లయ్య మంచినీరు తాగేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని భార్య పెద్ది పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement