
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
యువకుడి మృతి.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లో డ్రైవర్కు 219 పాయింట్లు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం మత్తులో కారును నడిపి ఓ నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. ప్రమాదం చేసిందే కాకుండా కావాలంటే పదేళ్లు జైలుకు పోతా.. నన్ను ఏమి చేయలేరంటూ వాహనదారులపై చిందులు వేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. వేములవాడ మండలం చింతలఠాణా ఆర్అండ్ఆర్ గ్రామానికి చెందిన కుర్మ నరేశ్(38) బైక్పై గురువారం జక్కాపూర్ వెళ్తున్నాడు. ఈక్రమంలోనే నేరెళ్ల శివారులో సిద్దిపేట నుంచి తంగళ్లపల్లి వైపు కారు అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో నరేశ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉండి ప్రశ్నించిన వాహనదారులపైకి చిందులు వేశాడు. పదేళ్లు జైలుకు పోతానంటూ వాగ్వాదానికి దిగాడు. కారు డ్రైవింగ్ చేసిన యువకుడికి బ్రీత్ అనలేజర్ టెస్టు నిర్వహించగా 219 పాయింట్లు వచ్చింది. మృతుడి అన్న కుర్మ రాజేశం ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో కారు డ్రైవింగ్