
బొమ్మకల్ పంచాయతీ భవనం విక్రయం!
కరీంనగర్రూరల్: కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన బొమ్మకల్కు చెందిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను వార్డు మాజీ సభ్యులు కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీగా ఉన్నపుడు సర్వే నంబరు–17లోని స్థలాన్ని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లుగా చేసి విక్రయించింది. లేఅవుట్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి విడిచిపెట్టిన మూడు గుంటల స్థలంలో 2023 సంవత్సరంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అప్పటి మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. మూడు అంతస్తుల్లో భవన నిర్మాణపు పనులను స్థానిక నాయకుడికి అప్పగించారు. పంచాయతీ నిధులు రూ.2,12,000తో విద్యుత్ మీటర్, బోరు వేసి విద్యుత్ మోటారు బిగించారు. స్లాబ్ వేసేందుకు కాంట్రాక్టర్కు పంచాయతీ నిధులు రూ.8లక్షలు చెల్లించారు. సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న క్రమంలో 26 జనవరి 2024 సంవత్సరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం బొమ్మకల్ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడంతో భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని జీపీకి రిజిస్ట్రేషన్ చేయలేదనే కారణంతో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు భవనాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు రియల్టర్లతో కుమ్మక్కయి చేస్తున్న ప్రయత్నాలు బొమ్మకల్లో చర్చనీయాంశంగా మారాయి. అప్రమత్తమైన వార్డు మాజీ సభ్యులు గూడ తిరుపతిరెడ్డి, వరాల శ్రీనివాస్, తోట కిరణ్కుమార్, గాదె శ్రీనివాస్ గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. భవనాన్ని స్వాధీనం చేసుకొని వార్డు కార్యాలయంగా ఏర్పాటు చేయాలని కోరగా.. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
మాజీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయి ప్రయత్నిస్తున్న రియల్టర్లు
మున్సిపల్ కమిషనర్కు వార్డు మాజీ సభ్యుల ఫిర్యాదు

బొమ్మకల్ పంచాయతీ భవనం విక్రయం!