రీఫండ్‌ పెండింగ్‌ రూ.30కోట్లు ! | - | Sakshi
Sakshi News home page

రీఫండ్‌ పెండింగ్‌ రూ.30కోట్లు !

Jun 21 2025 3:39 AM | Updated on Jun 21 2025 3:39 AM

రీఫండ్‌ పెండింగ్‌ రూ.30కోట్లు !

రీఫండ్‌ పెండింగ్‌ రూ.30కోట్లు !

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్నా రీఫండ్‌ కాని డబ్బులు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3వేల వరకు బాధితులు

ఐదేళ్లుగా పెండింగ్‌లోనే

కరీంనగర్‌క్రైం: ప్లాట్లు, భూములు, ఆస్తులు ఇతరత్రా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు చలాన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి వివిధ కారణాలతో రద్దయిన వారికి రీఫండ్‌ కావడం లేదు. గత ఐదేళ్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల మంది రూ.30 కోట్ల డబ్బును స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించగా పలు కారణాలతో రద్దయి తిరిగి చలాన్‌ ఫీజు రీఫండ్‌ కావాలని సుమారు ఐదేళ్లనుంచి ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నా నేటికీ రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోతున్నారు.

ఐదేళ్ల నుంచి ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కలుపుకొని సుమారుగా 3వేల మంది బాధితులకు రూ.30 కోట్ల వరకు రీఫండ్‌ మొత్తం రావాల్సి ఉంది. రూ.10 నుండి 30 వేల వరకు చిన్న మొత్తాలు ఉన్నవారు రీఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కొంతమందికి వస్తున్నట్లు సమాచారం. కానీ అంతకంటే ఎక్కువగా ఉన్న వారు సుమారుగా ఐదేళ్లనుంచి వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా తమ చేతిలో ఏమి లేదంటూ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చేతులెత్తేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాము చెల్లించిన రిజిస్ట్రేషన్‌ చలాన్‌ డబ్బులు వస్తాయా.. రావా అని ఆవేదన చెందుతున్నారు.

ట్రెజరీ శాఖలో రిజెక్ట్‌

రిజిస్ట్రేషన్‌ శాఖలో చలాన్‌ డబ్బులు మొత్తం ప్రభుత్వ అకౌంట్‌లో జమచేస్తారు. రీఫండ్‌ రావాలంటే ఫైనాన్స్‌, ట్రెజరీ శాఖ నుంచి విడుదల కావాల్సి ఉంటుంది. ఆయా ఫైల్స్‌కు చెందిన ఏడాది కాలం పెండింగ్‌లో పెట్టిన ట్రెజరీ శాఖ అధికారులు బాధితులకు రీఫండ్‌ చేసేందుకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్న నెపంతో రీఫండ్‌ ఫైల్స్‌ అని రిజెక్ట్‌ చేయడం బాధితులకు కలవరపాటుకు గురిచేస్తోంది. పెద్ద మొత్తాల్లో ఉన్నవారు ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌, పెద్ద స్థాయిలో పైరవీలు చేసిన వారికి మాత్రమే వస్తున్నాయని చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రిజిస్ట్రేషన్‌ స్టాంపుల శాఖ నుంచి తాము చలాన్‌ రూపంలో చెల్లించిన డబ్బు రీఫండ్‌ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement